Friday, April 26, 2024

నేపాల్ మలుపు!

- Advertisement -
- Advertisement -

నేపాల్ రాజకీయాల్లో సంభవించిన ఆకస్మిక మలుపు మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (సిపిఎన్‌ఎంసి) అధినేత, ఒకప్పటి సాయుధ పోరాట సారథి ప్రచండ (పుష్పకమల్ దహాల్) మూడో సారి ప్రధాని పదవి చేపట్టడానికి దారి తీసింది. నూతన ప్రధానిగా ప్రచండ చేత సోమవారం నాడు సాయంత్రం నేపాల్ అధ్యక్షురాలు విద్యాదేవి భండారి ప్రమాణ స్వీకారం చేయించారు. గత నెలలో జరిగిన ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీ లేదా కూటమి స్పష్టమైన మెజారిటీ సాధించుకోలేకపోయింది.

దీనితో ప్రభుత్వం ఏర్పాటు ఆలస్యమైంది. వారాల తరబడిగా సాగిన కసరత్తు చివరికి ప్రచండ పార్టీ పాలక కూటమి నుంచి వైదొలగి ప్రతిపక్ష సిపిఎన్ (యుఎంఎల్)తో చేతులు కలపడంతో ముగిసింది. 30 రోజుల్లో విశ్వాస ఓటింగ్‌లో నెగ్గిన తరాతనే ప్రచండ ప్రభుత్వానికి శాశ్వత అధికారం లభిస్తుంది. మొన్నటి ఎన్నికల్లో నేపాల్ కాంగ్రెస్ నాయకత్వంలోని పాలక కూటమి అత్యధిక స్థానాలను గెలుచుకొన్నది. నేపాల్ కాంగ్రెస్‌తో పాటు ప్రచండ పార్టీ కూడా భాగస్వామిగా వున్న ఈ కూటమిలో ముందుగా ఎవరు ప్రధాని కావాలనే అంశంపై ఏకీభావం కుదరకపోడంతో ప్రచండ వాకౌట్ చేసి ప్రతిపక్ష సిపిఎన్ (యుఎంఎల్)తో పొత్తు కుదుర్చుకొన్నారు.

ప్రధాని పదవిని ముందుగా తనకు ఇవ్వాలని దేవ్‌బా పట్టుపట్టడంతో కూటమిలో చీలిక వచ్చింది. కేవలం 32 స్థానాల సిపిఎన్ (మావోయిస్టు సెంటర్) అధినేత ప్రధాని పదవిని చేజిక్కించుకొన్నారు. ఈ ఏర్పాటుకు సిపిఎన్ (యుఎంఎల్) అధినేత ఓలి అంగీకరించడం విశేషం. 275 స్థానాలున్న నేపాల్ పార్లమెంటులో 165 స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు, 110 స్థానాలకు దామాషా పద్ధతి ఎన్నికలు జరుగుతాయి. 165 ప్రత్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అప్పటి వరకు దేశాన్ని పాలించిన కూటమిలోని ప్రధాన పక్షం నేపాల్ కాంగ్రెస్ 57 సీట్లను గెలుచుకోగా, ప్రతిపక్ష సిపిఎన్ (యుఎంఎల్) 44 స్థానాల్లో గెలుపొందింది.

దామాషా స్థానాలు కలుపుకోగా నేపాలీ కాంగ్రెస్ మొత్తం 89 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించింది. దాని తర్వాతి స్థానం 77 సీట్లతో ప్రతిపక్ష సిపిఎన్ (యుఎంఎల్)కు దక్కింది. మూడవ స్థానంలో 32 సీట్లతో ప్రచండ పార్టీ నిలిచింది. అధికార కూటమిలో వున్న నేపాలీ కాంగ్రెస్, సిపిఎన్(యుఎంఎల్)కు స్పష్టమైన మెజారిటీ రాకపోడంతో బేరసారాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ప్రచండ పార్టీ అధికార కూటమి నుంచి బయటపడి ప్రతిపక్ష కమ్యూనిస్టు పార్టీ (యుఎంఎల్) తో కలిసింది. దీనితో నేపాల్‌లో ఐక్య కమ్యూనిస్టు కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ కూటమిలో ఇంకా ఆర్‌ఎస్‌పి (20), ఆర్‌పిపి (14), జెఎస్‌పి (12), జనమత్ (6), నాగరిక్ వున్ముక్తి (3) పార్టీలు వున్నాయి.

ఈ కూటమి మొత్తం బలం 168. ఇందులో సిపిఎన్ (యుఎంఎల్)కు ప్రచండ పార్టీ బలం కంటే రెట్టింపుకి పైగా స్థానాలు వున్నందున ఈ ప్రభుత్వం సుస్థిరత అనుమానాస్పదంగానే వుంటుంది. రెండు కమ్యూనిస్టు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ప్రచండ తొలి రెండున్నరేళు, సిపిఎన్(యుఎంఎల్) అధినేత కెపి శర్మ ఓలి చివరి రెండున్నరేళ్ళు ప్రధానులుగా వుంటారు. కొత్త అధికార కూటమిలోని రెండు కమ్యూనిస్టు పార్టీలు చైనాకు సన్నిహితంగా వున్న చరిత్ర కలిగినవి. అందుచేత భారత దేశంతో కొత్త నేపాల్ ప్రభుత్వం సంబంధాలు ఎలా వుంటాయనేది సందేహాస్పదమే. భారత చైనాలతో సమాన దూరంలో వుంటూ కథ నడిపించుకు రావడం కొత్త ప్రభుత్వానికి సమస్యాత్మకమే అవుతుంది. గతంలో ప్రధానిగా వున్నప్పుడు శర్మ ఓలి భారత దేశం నుంచి బహు దూరమయ్యారు.

భారత భూభాగాలుగా వున్న లిపులెఖ్, కాలాపాని, లింపియాధుర ప్రాంతాలను నేపాల్‌కు చెందినవిగా ప్రకటించి తీవ్ర వివాదాన్ని సృష్టించారు. ఆ వివాదం తిరిగి బలం పుంజుకొనే ప్రమాదం లేకపోలేదు. దేవ్‌బా అధికారంలో వుండగా భారత చైనాలకు సమ దూరంలో వుంటూ నేపాల్ రాజకీయాలను చాకచక్యంగా నడిపించారనిపించుకొన్నారు. ఇప్పుడు దానికి బ్రేకు పడుతుందేమో చూడాలి. ఈసారి నేపాల్ ఎన్నికలు కొత్త శక్తులను ముందుకు తీసుకు వచ్చాయి. అక్కడి రాజకీయాల్లో బలం పుంజుకొంటున్న యువశక్తి పాత పార్టీల నత్త నడక ధోరణిని నిరసిస్తున్న సంగతిని రుజువు చేశాయి.

ఇది కొత్తగా ఏర్పడిన ఆర్‌ఎస్‌పి 20 స్థానాలు గెలుచుకోడంలో రుజువైంది. టెలివిజన్ యాంకర్‌గా ప్రసిద్ధి గాంచిన రబి లమిచానే కొత్తగా ఏర్పాటు చేసిన ఆర్‌ఎస్‌పి యువతరానికి ప్రాతినిధ్యం వహించింది. ఇక ముందు భారత, చైనాలు రెండింటికీ దూరంగా వుంటూ నేపాల్ స్వతంత్ర పంథాను ఎంచుకోవాలని యువత ఆశిస్తున్నట్టు స్పష్టపడుతున్నది. కేవలం భూ సరిహద్దులే వున్న నేపాల్, ఎక్కువగా భారత దేశంపై ఆధారపడి వుండాలి. దానికి అవసరమైన దిగుమతులు ఇండియా నుంచి గాని, ఇండియా మీది నుంచి గాని మాత్రమే చేరవలసి వుంది. ఈ నేపథ్యంలో ప్రచండ నాయకత్వంలోని కొత్త కూటమి ప్రభుత్వం అడుగులు ఎటుపడతాయోనన్నది ఆసక్తిదాయకం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News