యువశాస్త్రవేత్తలకు మోడీ పిలుపు
ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ను ప్రారంభించిన ప్రధాని
బెంగళూరు: సృజనాత్మకత, పేటెంట్ , ఉత్పత్తి, వికాసం అనే అంశాలపై దృష్టి నిలపాలని, అదే తన ఆశయమని ప్రధాని నరేంద్రమోడీ యువ శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు. ఈ నాలుగు అడుగులు దేశాన్ని త్వరితగతిన అభివృద్ధి వైపు నడిపిస్తాయని ఆయన చెప్పారు. శాస్త్ర, సాంకేతిక, సృజనాత్మక రంగాల్లో దేశం పరిధిని విస్తృతం చేసుకొని ఆ దిశగా మారాల్సిన అవసరం ఉందని ప్రధాని ఉద్ఘాటించారు. ‘శాస్త్ర, సాంకేతిక రంగంలో విజయంపై భారతదేశ ప్రగతి కథ ఆధారపడి ఉంది’ అని మోడీ పేర్కొన్నారు. శుక్రవారం ఇక్కడ 107వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ను ప్రారంభించిన తర్వాత ప్రధాని మాట్లాడుతూ ‘మనం ఏదైనా సృష్టిస్తే దానిపై మనకు హక్కుంటుంది.
దాంతో మనం సునాయాసంగా ఉత్పత్తి చేయగలం. ఆ ఉత్పత్తుల్ని దేశ ప్రజలకు అందించినప్పుడు వారు బాగుపడతారు. ప్రజలకోసం, ప్రజల చేత సృజనాత్మకత అనేవి నవ్య భారతానికి దిశానిర్దేశం చేస్తాయి. అంతర్జాతీయ సృజనాత్మక సూచిలో భారతదేశపు ర్యాంక్ మెరుగుపడినందుకు తనకు సంతోషంగా ఉందని ప్రధాని చెప్పారు. ‘గడచిన 50 ఏళ్లకంటే గత ఐదేళ్లలో మనం చేపట్టిన కార్యక్రమాలు మరింత సాంకేతిక వాణిజ్యాన్ని అందించాయి. ఈ విజయానికి మన శాస్త్రవేత్తల్ని అభినందిస్తున్నాను’ అని మోడీ అన్నారు. కేంద్రమంత్రి హర్షవర్ధన్, కర్ణాటక ముఖ్యమంత్రి యెడియూరప్ప కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.