గౌహతి: వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియా మరో సిరీస్పై కన్నేసింది. కొత్త ఏడాదిలో జరిగే తొలి సిరీస్ను గెలిచి సీజన్ను ప్రారంభించాలనే పట్టుదలతో భారత్ ఉంది. శ్రీలంకతో సొంత గడ్డపై జరుగుతున్న మూడు మ్యాచ్ల ట్వంటీ20 సిరీస్కు టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇటీవలే వెస్టిండీస్తో జరిగిన సిరీస్లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక, ఈ ఏడాది ఆడుతున్న తొలి సిరీస్లోనే విజయం సాధించి రానున్న టోర్నీలకు మరింత ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలని భారత్ భావిస్తోంది. స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ లేకుండానే టీమిండియా సిరీస్లో బరిలోకి దిగుతోంది. అయితే రోహిత్ లేకున్నా భారత్కు వచ్చే ఇబ్బంది ఏమీలేదు. శిఖర్ ధావన్, లోకేశ్ రాహుల్లు ఈ లోటును సమర్థంగా పూరించే అవకాశాలున్నాయి. పొట్టి ఫార్మాట్లో ఇద్దరికీ మంచి రికార్డే ఉంది.
ఇక, కెప్టెన్ విరాట్ కోహ్లి రూపంలో టీమిండియా పదునైన అస్త్రం ఉండనే ఉంది. తాను చెలరేగితే మ్యాచ్ ఫలితం ఎలా ఉంటుందో ఇటీవలే వెస్టిండీస్తో జరిగిన టి20 మ్యాచ్లో కోహ్లి చూపించాడు. వరుస సిక్సర్లు, ఫోర్లతో కోహ్లి ఆడిన ఇన్నింగ్స్ క్రికెట్ చరిత్రలోనే చిరకాలం గుర్తుండి పోతుందనడంలో సందేహం లేదు. ఇక, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, మనీష్ పాండే, రవీంద్ర జడేజా తదితరులతో భారత బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే స్టార్లు ఉండడంతో భారత్ ఈ సిరీస్లో ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. అంతేగాక రవీంద్ర జడేజా, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్ వంటి ఆల్రౌండర్లు కూడా ఉండనే ఉన్నారు.
ఇక, కొంత కాలంగా గాయంతో జట్టుకు దూరంగా ఉన్న మ్యాచ్ విన్నర్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా రాకతో బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా తయారైంది. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా పేరున్న బుమ్రా చేరికతో భారత బౌలింగ్కు ఎదురే లేకుండా పోయింది. ఇక దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, నవ్దీప్ సైనీ వంటి ప్రతిభావంతులైన ఫాస్ట్ బ్లౌలర్లు ఉండనే ఉన్నారు. మరోవైపు వాషింగ్టన్ సుందర్, చాహల్, కుల్దీప్ యాదవ్లతో స్పిన్ విభాగం కూడా అత్యంత పటిష్టంగా ఉంది. ఇలా అన్ని విభాగాల్లో బలంగా ఉన్న టీమిండియా సిరీస్పై కన్నేసింది.