Friday, March 29, 2024

మధ్యంతర డివిడెండ్‌పై భేటీ

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వ ఆదాయం తగ్గిన నేపథ్యంలో వచ్చే ఆర్‌బిఐ బోర్డు సమావేంలో చర్చ
న్యూఢిల్లీ: వచ్చే ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) సమావేశంలో మధ్యంతర డివిడెండ్ అంశంపై చర్చించే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఆదాయం తగ్గిన నేపథ్యంలో 3.3 శాతం ద్రవ్యలోటు లక్ష్యం చేరుకోలేక ప్రభుత్వం సతమతమవుతోంది. ఈ పరిస్థితుల్లో ఆర్‌బిఐ సమావేశం ప్రధాన్యతను సంతరించుకుంది. రెవెన్యూ వసూళ్లు ఆశించిన మేరకు లేకపోవడంతో ప్రభుత్వ ఖజానా ఒత్తిడిని ఎదుర్కొంటోంది. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) రెండో త్రైమాసికంలో 4.5 శాతంతో ఆరు సంవత్సరాల కనిష్టానికి పడిపోయిన వృద్ధి రేటును గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. ప్రభుత్వం అంచనా ప్రకారం, దేశీయ జిడిపి (స్థూల దేశీయోత్పత్తి) వృద్ధి రేటు 5 శాతంతో 11ఏళ్ల కనిష్టానికి పడిపోయింది. ఇది గత ఆర్థిక సంవత్సరంలో(201819) 6.8 శాతం ఉండగా, ఇప్పుడు మరింతగా క్షీణించింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు లోపు ఒక్క ఆర్‌బిఐ బోర్డు సమావేశమైనా నిర్వహించతలపెట్టగా, భేటీలో ప్రభుత్వ నామినీ డైరెక్టర్లు ఈ మధ్యంత డివిడెండ్ అంశాన్ని ప్రస్తావించే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామ న్ అధ్యక్షతన బోర్డు సమావేశం జరగవచ్చని, ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్ విజన్ గురించి వివరించవచ్చని సమాచారం. ఒకవేళ సమావేశంలో మధ్యంతర డివిడెండ్‌కు ఆర్‌బిఐ గ్రీన్‌సిగ్నల్ ఇస్తే ఇది ప్రభుత్వానికి ఎంతో ఊరట కల్గిస్తుందని అంటున్నారు.
ప్రపంచంలోనే అత్యధిక ఎన్‌పిఎలు భారత్‌లో..
భారత ఆర్థిక వ్యవస్థ చాలా కాలంగా కొట్టుమిట్టాడుతోంది. భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థలో నిరర్ధక ఆస్తి (ఎన్‌పిఎ) ఒక ప్రధాన సమస్యగా మారింది. బ్యాంకుల్లో కోట్లాది రూపాయల రుణాలు మొండి బకాయిలుగా మారడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఎన్‌పిఎలు బ్యాంకింగ్ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ కారణంగా బ్యాంకులు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఎన్‌పిఎలు పెరగడం వల్ల రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకులు ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. మొండి బకాయిల పరంగా ప్రపంచంలోని 10 పెద్ద ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం అగ్రస్థానంలో ఉందని ఇటీవల ఆర్‌బిఐ తన నివేదికలో పేర్కొంది. ఇటలీ రెండో స్థానంలో ఉంది. ఇటలీ 2018 డిసెంబర్ నాటికి 8.5 శాతం మొండి బకాయిల నిష్పత్తిని కలిగి ఉంది. మార్చి 2019 నాటికి ఎన్‌పిఎల జాబితాలో బ్రెజిల్ 3.1 శాతం నిష్పత్తితో మూడో స్థానంలో ఉంది. గణాంకాల ప్రకారం, 2019 మార్చి నాటికి చైనాలో ఎన్‌పిఎల నిష్పత్తి 1.8 శాతం కాగా, భారతదేశంలో ఈ నిష్పత్తి 9.3 శాతంగా ఉంది. భారతదేశంలో సుమారు 11.46 లక్షల కోట్లు ఎన్‌పిఎలుగా ఉన్నాయి. అయితే చైనా ఎన్‌పిఎలు మూడు రెట్లు తక్కువ, అంటే సుమారు రూ .3.79 లక్షల కోట్లు. అందువల్ల, పొరుగు దేశమైన చైనా కంటే మొండి బకాయిల నిష్పత్తిలో భారత్ చాలా వెనుకబడి ఉంది. నిరర్థక ఆస్తుల పరంగా కెనడా ప్రపంచంలోని టాప్ 10 ఆర్థిక వ్యవస్థలలో క్లీన్‌గా ఉంది. అంటే ఈ దేశంలో అంతగదా మొండి బకాయిలు లేవు. కెనడాలో ఎన్‌పిఎల నిష్పత్తి 0.4 శాతం మాత్రమే.

20%కి పైగా 4 బ్యాంకుల స్థూల ఎన్‌పిఎలు
ఆస్తి నాణ్యత బ్యాంక్ వారీగా చూస్తే, 24 బ్యాంకుల స్థూల ఎన్‌పిఎ నిష్పత్తి 2019 సెప్టెంబర్‌లో 5 శాతం కంటే తక్కువగా ఉంది. అయితే నాలుగు బ్యాంకుల స్థూల ఎన్‌పిఎ నిష్పత్తి 20 శాతానికి పైగా ఉంది. వ్యవసాయం, సేవా రంగాల ఆస్తి నాణ్యతను స్థూల ఎన్‌పిఎలుగా కొలుస్తారు. ఇది 2019 సెప్టెంబర్‌లో 10.1 శాతానికి పెరిగింది. ఇది 2019 మార్చిలో ఎనిమిది శాతంగా ఉంది. ఈ కాలంలో పరిశ్రమలకు రుణాలు ఐదు శాతం నుంచి 3.79 శాతానికి పడిపోయాయి.

హెచ్చరించిన ఆర్‌బిఐ

ఇటీవల ఆర్‌బిఐ( రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) కూడా బ్యాంకుల ఎన్‌పిఎల గురించి హెచ్చరికలు చేసింది. 2020 సెప్టెంబరు నాటికి బ్యాంకుల స్థూల ఎన్‌పిఎ నిష్పత్తి 2019 సెప్టెంబర్‌లో 9.3 శాతం స్థాయి నుంచి 9.9 శాతానికి పెరిగే అవకాశం ఉందని ఆర్ బిఐ తెలిపింది. ఆర్‌బిఐ తన ఆర్థిక స్థిరత్వ నివేదిక (ఎఫ్‌ఎస్‌ఆర్) లో ఈ విషయం తెలిపింది. స్థూల ఆర్థిక వ్యవస్థలో సవాళ్లు, మొండి బకా యిల పెరుగుదల, రుణ వృద్ధి మందగమనం దృష్ట్యా బ్యాంకుల మొత్తం ఎన్‌పిఎ నిష్పత్తి 9.9 శాతానికి పెరిగే అవకాశం ఉందని ఆర్‌బిఐ తెలిపింది. నివేదిక ప్రకారం, ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల ఎన్‌పిఎలు 2020 సెప్టెం బర్ నాటికి 13.2 శాతానికి పెరగవచ్చు. ఇది 2019 సెప్టెంబర్‌లో 12.7 శాతంగా ఉంది. అదే సమయంలో ప్రైవేట్ బ్యాంకుల స్థూల ఎన్‌పిఎలు 3.9 శాతం నుండి 4.2 శాతానికి పెరగవచ్చు. విదేశీ బ్యాంకుల స్థూల ఎన్‌పిఎలు 2.9 శాతం నుంచి 3.1 శాతానికి పెరగవచ్చు. బ్యాంకుల నికర ఎన్‌పిఎ నిష్పత్తి 2019 సెప్టెంబర్‌లో 3.7 శాతానికి తగ్గిందని, ఇది ప్రొవిజనింగ్ పెరుగుదలను ప్రతిబింబిస్త్తోందని నివేదిక పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటిమొదటి భాగంలో బ్యాంకింగ్ రహిత ఆర్థిక సంస్థల (ఎన్‌బిఎఫ్‌సి) ఇబ్బందులు పెరిగాయి. నివేదిక ప్రకారం, ఎన్‌బిఎఫ్‌సిల స్థూల ఎన్‌పిఎలు 2019 సెప్టెంబర్‌లో 6.3 శాతానికి పెరిగాయి.

RBI Meeting on Interim Dividend

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News