Friday, April 26, 2024

పర్వతగిరి పర్వతాల శివాలయం పునః ప్రతిష్టాపన : మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

- Advertisement -
- Advertisement -

 

కాకతీయుల కాలంలో నిర్మించి, 700 సంవత్సరాల చారిత్రక ప్రాశస్త్యం కలిగిన పర్వతగిరి శివాలయ పునః ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఈ నెల 26,27,28 వ తేదీలలో మూడు రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి , గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. దాదాపు 15 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆలయ పునః ప్రతిష్టాపన చేస్తున్నామని, దీనికి చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులంతా పెద్ద ఎత్తున తరలివచ్చి ఇంటినుంచి తెచ్చిన జలంతో శివుడికి అభిషేకం చేయాలని కోరారు.

ఈనెల 26వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పునః ప్రతిష్టాపన కార్యక్రమంపై మంత్రి ,ఎమ్మెల్యే జిల్లా శాఖ అధికారులతో శివాలయం వద్ద సమీక్ష చేశారు. ముందు పర్వతాల శివాలయానికి నూతనంగా ఏర్పాటు చేసిన దాదాపు 700 మెట్లను ఎక్కి పరిసర ప్రాంతాలను భక్తుల వసతులను మంత్రి స్వయంగా పర్యవేక్షించారు. అనంతరం ఎలక్ర్టిసిటీ లైన్స్ కు శంకుస్థాపన చేశారు. వాలయానికి మూడు రోజుల్లో, వేలు, లక్షల్లో భక్తులు వస్తారని, శివాలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

పర్వతగిరి రిజర్వాయర్ ను లోయర్ మానేర్ డ్యాం నీటితో జాతరనాటికి నింపాలని దేవాదుల చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డిని మంత్రి ఆదేశించారు. రిజర్వాయర్లో భక్తుల ఆహ్లాదం కోసం బోటింగ్ ఏర్పాటు చేయాలని టూరిజం శాఖ అధికారులను కోరారు. మూడు రోజులపాటు పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్న నేపథ్యంలో వారి ఆరోగ్య పరిరక్షణ కోసం తగినన్ని మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. పర్వతాల శివాలయం జాతరకు వచ్చే భక్తులకు పర్వతగిరి నుంచి గుట్ట వరకు తగినని బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

గుట్టమీదికి వెళ్లడానికి వృద్ధులకు వాహన వసతి కల్పిస్తున్నట్లు తెలిపారు. జాతరలో భక్తి భావం పెంపొందించే విధంగా శివుడి మీద పర్వతాల శివాలయం కోసం ప్రత్యేకంగా పాటలు రాయించి నేడు విడుదల చేశారు. జాతర సందర్భంగా సింగర్స్ సునీత, మంగ్లీ, మధుప్రియ లను రప్పించే ప్రయత్నం చేయాలని కమిటీ నిర్వాహకులకు సూచించారు. భక్తుల రద్దీ నియంత్రణకు, పార్కింగ్ వసతులకు పోలీసులు తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని చెప్పారు. ఇప్పటికే ముద్రించిన శివాలయ జాతర కరపత్రాలను చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ వెళ్లి ఇంటింటికి ఆహ్వానించాలని సూచించారు.

జాతరకు వచ్చే భక్తులు తమ ఇంటి నుంచి గోదావరి జలాలు తీసుకొచ్చి శివునికి అభిషేకించాలని ప్రత్యేకంగా కోరారు. ప్రతిష్టాత్మకంగా పునః నిర్మాణం చేసి ప్రారంభించుకుంటున్న ఈ పవిత్ర కార్యాన్ని అందరూ కలిసి విజయవంతం చేయాలని ఆ శివుని కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ సమావేశంలో దేవాదాయశాఖ, పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్, మిషన్ భగీరథ, పోలీస్, వైద్య ఆరోగ్య, ఇరిగేషన్, టూరిజం, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News