హోబర్ట్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పునరాగమనంలో అదరగొడుతోంది. రెండేళ్లు సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్లోనే ఫైనల్కు చేరి పెను ప్రకంపనలు సృష్టించింది. హోబర్ట్ ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల డబుల్స్ విభాగంలో ఉక్రెయిన్ క్రీడాకారిణి నదియా కిచెనోక్తో కలిసి బరిలోకి దిగిన సానియా మీర్జా టైటిల్ పోరుకు అర్హత సాధించింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో సానియా జంట 76, 62తో టమరా జిదెన్సెక్ (స్లోవేకియా), మేరీ బౌజ్కోవా (చెక్) జోడీని చిత్తు చేసింది. తొలి సెట్లో పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది. ఇటు సానియా జంట, అటు ప్రత్యర్థి జోడీ ప్రతి పాయింట్ కోసం సర్వం ఒడ్డాయి. దీంతో ఈ సెట్ టైబ్రేకర్ వరకు వెళ్లక తప్పలేదు. ఇందులో చివరి వరకు ఆధిపత్యం కాపాడుకున్న సానియా జోడీ విజయం సాధించింది. ఇక, రెండో సెట్లో మాత్రం సానియా ద్వయంకు పెద్దగా ప్రతిఘటన ఎదురు కాలేదు. చివరి వరకు దూకుడును ప్రదర్శించిన ఈ జోడీని అలవోకగా సెట్ను గెలిచి ఫైనల్కు దూసుకెళ్లింది. ఇక, ఫైనల్లో సానియా జంటకు చైనాకు చెందిన షువై పెంగ్షువై ఝాంగ్ జోడీతో తలపడుతుంది.