ఎన్నాళ్లకెన్నాళ్లకూ…
చిరంజీవితో కలిసి నటించేవారూ ప్రేక్షకుల గుండెల్లో చిరకాలం ఉండిపోతారు. వారిలో చిరంజీవి విజయశాంతి ఒక జంటకాగా, చిరంజీవి మోహన్బాబు మరో జంట. ఈ కొత్త సంవత్సరంలో ఈ జంటలు మనస్ఫూర్తిగా మనస్పర్థలు పోగొట్టుకుని ఆత్మీయ ఆలింగనం చేసుకోవడం మనం చూశాం.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) డైరీ విడుదల కార్యక్రమానికి హాజరైన చిరంజీవి, మోహన్బాబు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం మోహన్బాబు ముద్దు పెట్టమని కోరగా.. చిరంజీవి ఆయన్ని ప్రేమగా ముద్దుపెట్టుకున్నారు. చిరంజీవికి తనకి మధ్య ఎలాంటి విభేదాలు లేవని, కళామతల్లి ముద్దు బిడ్డలమని మోహన్బాబు అన్నాడు. చిరు-మోహన్బాబు ఆలింగనం చేసుకున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్గా మారాయి. ఈ నేపథ్యంలో
“ ఈ ఇద్దరు లెజెండ్స్ ఎంత ప్రశాంతంగా ఉన్నారో.. మా తరం అందరిలోనూ స్ఫూర్తి నింపారు. భవిష్యత్తుతరాల వారిలోనూ స్ఫూర్తిని నింపుతున్నారు. నిజమైన గ్యాంగ్ స్టార్స్. వీరి మధ్య ఉన్న స్నేహం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ రాక్స్..! బెస్ట్ పిక్తో 2020 ప్రారంభమైంది.” అంటూ ఈ ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశాడు మంచు మనోజ్.
మళ్లీ నాకు దగ్గరైంది!
చిరంజీవి, విజయశాంతి కలిసి పదహారు సినిమాలు చేశారు. టాలీవుడ్ చరిత్రలో వీరి కాంబినేషన్ ఎవర్గ్రీన్. సూపర్ హిట్ కాంబినేషన్స్లో ఒకటైన ఈ జంట రియల్ లైఫ్లో మాత్రం దాదాపు 20ఏళ్లుగా పలకరించుకోలేదు. యాక్టింగ్ పరంగానే, డాన్సుల్లోనూ పోటీపడి నటించిన వీళ్లిద్దరూ రాజకీయాల కారణంగా విడిపోయారు. చెన్నైలో ఎదురెదురు ఇళ్లలో ఉన్న వీళ్లు కుటుంబపరంగా కూడా మంచి అనుబంధం ఉన్నవాళ్లు. ఒక దశలో చిరంజీవిపై విజయశాంతి తీవ్ర విమర్శలు చేసింది. చిరంజీవి రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఇప్పడు ఇద్దరూ సినిమాల్లో ఉంటున్నారు.
దాదాపు 20 ఏళ్ల తర్వాత చిరంజీవి, విజయశాంతి కలుసుకున్నారు. సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది. “ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితం నన్ను వదిలి వెళ్ళిపోయింది నా హీరోయిన్. మళ్లీ ఇన్నాళ్ళకు నాకు కనిపించింది. నువ్వు రాజకీయాల్లోకి నా కంటే ముందు వెళ్ళవు కదా.. మరి వెనుక వచ్చిన నన్నెందుకు తిట్టావు?” అంటూ అడుగుతూ ఎమోషన్ల్గా ఫీలయ్యాడు చిరంజీవి. సినిమాలు వేరు రాజకీయాలు వేరంటూ ఆమె నవ్వుతూ సమాధానం చెప్పి హుందాగా ప్రవర్తించింది. రాజకీయాల వల్ల శత్రువులు పెరిగితే సినిమాల వల్ల మిత్రులు దగ్గరవుతారని, ఈ వేడుక ద్వారా విజయాశాంతి మళ్లీ తనకు దగ్గరైందని, ఈ క్రెడిట్ మహేష్బాబుదే అంటూ చిరంజీవి సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ప్రేక్షకులకు ఆనందం పంచిన ఈ వీడియో వైరల్ అయ్యింది.