Tuesday, April 30, 2024

జనవరిలో సెట్స్ షెడ్యూల్…?

- Advertisement -
- Advertisement -

నూతన విద్యాశాఖ మంత్రి వచ్చిన తర్వాత
షెడ్యూల్ ప్రకటించే అవకాశం
విద్యాశాఖ కార్యదర్శి మార్పు
సీనియర్ ఐఎఎస్ అధికారి
బుర్రా వెంకటేశంకు కీలక బాధ్యతలు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ సహా వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలు(సెట్స్) షెడ్యూల్ వచ్చే నెలలో వెలువడే అవకాశం ఉంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి విద్యాశాఖ మంత్రి ఖరారైన వెంటనే ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఉన్నత విద్యామండలి చైర్మన్, ఒక వైస్ చైర్మన్‌ను తొలగించిన ప్రభుత్వం తాజాగా విద్యాశాఖ కార్యదర్శిని బదిలీ చేసి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఎఎస్ అధికారి బుర్రా వెంకటేశంను నియమించింది. విద్యాశాఖలో సీనియర్ ఐఎఎస్ అధికారికి ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పజెప్పిన నేపథ్యంలో ఈ శాఖలో కీలక మార్పులు చోటు చేసుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కొత్త విద్యాశాఖ మంత్రి వచ్చిన తర్వాత ఉన్నత విద్యామండలి చైర్మన్, వైస్ చైర్మన్ నియమించిన తర్వాత సెట్స్ షెడ్యూల్ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. విద్యాశాఖ మంత్రి వచ్చిన తర్వాత ఆయన ఆధ్వర్యంలో నూతనంగా నియమితులైన విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, కొత్త ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆధ్వర్యంలో సెట్ల షెడ్యూల్‌ను ప్రకటించిన పరీక్షలు జరుగనున్నట్లు తెలుస్తోంది. ఈ నెలలో కొత్త విద్యాశాఖ మంత్రి వస్తే ఈ నెలాఖరులో లేదా జనవరి మొదటివారంలో రాష్ట్రంలో అన్ని ప్రవేశ పరీక్షలకు సెట్ల కన్వీనర్ల నియామకం, పరీక్షల నిర్వహణ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఉన్నత విద్యామండలి చైర్మన్ నియామకం తర్వాత ఎంసెట్, ఇసెట్, ఎడ్‌సెట్, లాసెట్ తదితర ప్రవేశ పరీక్షలు నిర్వహించే యూనివర్సిటీలను ఖరారు చేసి, ఆయా సెట్లకు కన్వీనర్ల నియామకం కోసం యూనివర్సిటీలకు లేఖలు రాయనున్నారు. యూనివర్సిటీలు తమ పరిధిలోని సెట్‌కు కన్వీనర్‌ను నియమించేందుకు ముగ్గురు ప్రొఫెసర్ల పేర్లను సిఫారసు చేస్తే అందులో ఒకరిని ఆయా సెట్‌లకు కన్వీనర్లుగా ఉన్నత విద్యామండలి నియమించనుంది. ఈసారి సెట్ల కన్వీనర్లు కూడా మారనున్నట్లు సమాచారం.

ఇప్పటికే జెఇఇ, నీట్ షెడ్యూల్ ఖరారు

జెఇఇ మెయిన్, నీట్ షెడ్యూల్ ఇప్పటికే ఖరారైన నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు చేయగా, కొత్త చైర్మన్ వచ్చిన తర్వాత మరోసారి కసరత్తు చేసి షెడ్యూల్ ఖరారు చేయనున్నట్లు సమాచారం. సాధారణంగా ఏటా మే నెలలో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. ఈసారి కూడా 2024 మే నెలలోనే ప్రవేశ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. 2024 జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు జెఇఇ మెయిన్ మొదటి విడత, ఏప్రిల్ 1 నుంచి 15 రెండో విడత పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎన్‌టిఎ వెల్లడించింది. దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే నేషనల్ ఎలిజబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్ యుజి) పరీక్ష 2024 మే 5వ తేదీన జరగనుంది.

మే నెలలో ఎంసెట్..?

వచ్చే విద్యాసంవత్సరం వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షలను(సెట్స్) మే లేదా జూన్‌లో నెలలో నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంసెట్ సహా ప్రవేశ పరీక్షలన్నీ జూన్ నెలలో నిర్వహించి జూలైలో కౌన్సెలింగ్ ప్రక్రియను పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చిలో ఇంటర్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ విద్య కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్ పరీక్షను మే నెలలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే విద్యాసంవత్సరం ప్రవేశాలకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఎఐసిటిఇ) నిబంధనలకు అనుగుణంగా సెట్స్ షెడ్యూల్‌పై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ముఖ్యంగా ఎంసెట్‌కు హాజరయ్యే విద్యార్థుల్లో ఎక్కువ మంది జెఇఇ మెయిన్‌కు కూడా హాజరవుతారు కాబట్టి, విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా ఎంసెట్ పరీక్ష తేదీలను ఉన్నత విద్యామండలి నిర్ణయించనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News