Thursday, April 25, 2024

రోజుకో మలుపు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ కేసులో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసులో మరో సంచలన విషయం వెలుగు చూసింది. ఎఇఇ ఎగ్జామ్ పేపర్ లీకేజీలో సిట్ అధికారులు కీలక విషయాలు గుర్తించి షాకయ్యారు. ఎలక్ట్రానిక్ డివైజ్ వాడి టిఎస్‌పిఎస్‌సి ఎగ్జామ్ రాసిన ముగ్గుర్ని పోలీసులు అరెస్ట్ అయ్యారు. ప్రశాంత్, మహేష్, నవీన్ అనే ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. రమేష్ ద్వారా ఎఇఇ పేపర్‌ను నిందితులు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే 45 మందిని అరెస్టు చేయగా, సోమవారం మరో ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. దీంతో టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ కేసులో మెుత్తం అరెస్టుల సంఖ్య 48కు చేరింది.

ఆదివారం అరెస్టయిన వారిలో సైతం ఏఇఇ పేపర్ కొనుగోలు చేసిన వారే ఉన్నారు. ఆదివారం రమేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయగా, అతడు రవికిషోర్ నుంచి ఏఇఇ సివిల్, జనరల్ నాలెడ్జ్ పేపర్లను కొనుగోలు చేసినట్లు విచారణలో అంగీకరించాడు. అయితే రమేష్ సైతం మరో 20 మందికి ఏఇఇ పేపర్ విక్రయించినట్లు చెప్పాడు. కోచింగ్ సెంటర్లో పరిచయమైన వారికి పేపర్ అమ్మినట్లు సిట్ అధికారులు వివరాలు సేకరించారు. రమేష్ ఇచ్చిన సమాచారంతో సోమవారం నాడు ప్రశాంత్, మహేష్, నవీన్ అనే ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

వరంగల్ జిల్లాలో విద్యుత్ శాఖలో డివిజనల్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు రమేష్. అశోక్ నగర్ లోని ఓ కోచింగ్ సెంటర్ రమేష్ ఫ్యాకల్టీగానూ పనిచేస్తున్నాడు. అదే సెంటర్ లో కోచింగ్ తీసుకుంటున్న ప్రశాంత్, మహేష్, నవీన్ అనే ముగ్గురికి ఏఇఇ పేపర్ విక్రయించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. అయినప్పటికీ ఎగ్జామ్ హాల్ కు వీళ్లు బ్లూ టూత్‌లతో వెళ్లారు. రమేష్ బయట నుంచి ఆన్సర్లు చెబుతుంటే రోబో, శంకర్ దాదా సినిమా సీన్ తరహాలో ముగ్గురు నిందితులు ఆన్సర్లు విని ఓఎంఆర్‌లో బబులింగ్ చేసినట్లు గుర్తించి అధికారులు విస్తుపోయారు. అసలు ఎగ్జామ్ హాల్ కు చిన్న వస్తువు తీసుకెళ్లినా అనుమతి లేదు, మరి నిందితులు బ్లూ టూత్ డివైజ్ లతో ఎలా ఎగ్జామ్ హాల్ లోకి వెళ్లారు? ఏ సెంటర్ లో ఎగ్జామ్ రాశారు? అనే కోణంలోనూ దర్యాప్తు చేపట్టింది సిట్.

వీరికేనా ఇంకా ఎవరికైనా రమేష్ పేపర్ విక్రయించాడా? ఎలక్ట్రానిక్ డివైజ్ వాడి ఇంకెంత మంది టిఎస్‌పిఎస్‌సి ఎగ్జామ్ రాశారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ జీవితాలు నాశనం అవుతున్నాయంటూ 30 లక్షల మంది అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు నిర్వహిస్తున్న పరీక్షలనైనా పకడ్భందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, టిఎస్‌పిఎస్‌సిని కోరుతున్నారు. స్కూల్ పిల్లలు చెప్పే (A+B)2 ఫార్ములాలు సైతం ఏఇ ఎగ్జామ్ టాపర్లు చెప్పలేకపోయారు. కేవలం రెండు నెలల్లోనే ఎగ్జామ్‌లో రాసిన ఆన్సర్లను చెప్పలేక కొందరు నీళ్లు నమిలారు. దాంతో ఏ స్థాయిలో పేపర్ లీక్ అయిందనే దానిపై సిట్ దృష్టి సారించింది. దీంతో, మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News