హైదరాబాద్ : కొన్ని వేల సంవత్సరాల నుంచి తెలంగాణ సాంస్కృతిక సంపదను కలిగి ఉందని తెలంగాణ జాగృతి ఖతర్ అధ్యక్షురాలు నందిని అబ్బగౌని పేర్కొన్నారు. తెలంగాణ జాగృతి ఖతర్ ఆధ్వర్యంలో ప్రపంచ వేదికపై తెలంగాణ సాంస్కృతిక వైభవం విరాజిల్లుతోందన్నారు. దోహ, ఖతర్లో ఇండియన్ కల్చరల్ సెంటర్, భారత రాయబార కార్యాలయం (ఖతర్) మ్యూజియం సహకారంతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా నందిని అబ్బగౌని మాట్లాడుతూ.. భారత- ఖతర్ సాంస్కృతిక వార్షికోత్సవం ‘పాసేజ్ టు ఇండియా’ పేరుతో తెలంగాణ జాగృతి ఖతర్ ఆధ్వర్యంలో జనవరి 16,17 తేదీల్లో ఏర్పాటు చేసిన ప్రదర్శన ప్రధాన ఆకర్శణగా నిలిచిందన్నారు.
తెలంగాణ సంస్కృతి గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియ చేయడానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ‘తెలంగాణ జాగృతి’ స్థాపించి ముందుకు తీసుకెళుతున్నారన్నారు. ఈ వేడుకల్లో భాగంగా తెలంగాణ జాగృతి ఖతర్ సభ్యులు, హారిక, సుధ, లావణ్య, పద్మిని, రేణుక, మమత, శ్రావణి, ప్రసన్న, ప్రవీణ, రాజేశ్వరి, జ్యోతిలు తెలంగాణలో విశేష ప్రాచుర్యం పొందిన బంజారా, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను ప్రత్యేకతలను, ఔన్నత్యాన్ని నృత్య రూపంలో ప్రదర్శించి ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నారు.