Thursday, May 2, 2024

లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తులు ఉండవు

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌తో సమానంగా పోరాటం చేస్తాం : కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్: రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు బిజెపి శ్రేణులు సిద్ధం కావాలని కేంద్రమంత్రి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తులు ఉండవని, తెలంగాణలో బిజెపి ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. శుక్రవారం తమ పార్టీ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జీలు, పార్లమెంట్ ప్రబారీలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. డిసెంబర్ చివరి వారంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి. నడ్డా తెలంగాణకు రానున్నట్లు తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో జనసేనతో పొత్తు లేకుండా ఎన్నికల బరిలో దిగుతామని, బిజెపి, బిఆర్‌ఎస్ పొత్తు కేవలం విపక్ష పార్టీల ప్రచారం మాత్రమేనని కొట్టిపారేశారు.

తెలంగాణలో కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌తో సమానంగా తమ పార్టీ పోరాటం ఉంటుందని, లోక్ సభలో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. తెలంగాణలో రాజకీయంగా బిజెపికి మంచి అవకాశముందని, సర్వే సంస్థలకు అందని విధంగా లోక్ సభ ఫలితాలు బిజెపికి అనుకూలంగా ఉంటాయని వెల్లడించారు. శనివారం నుంచి తెలంగాణలో వికసిత్ భారత్ కార్యక్రమం ఉంటుందని, ఈకార్యక్రమంలో భాగంగా కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకువెళతామన్నారు. కొత్తగా గెలిచిన 8 మంది బిజెపి ఎమ్మెల్యేలు అన్ని ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తారన్నారు. కేంద్రంలో మూడోసారి నరేంద్రమోడీ ప్రభుత్వం ఏర్పడనుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీకి సంబంధించి అన్ని కమిటీల నియామకాలు పూర్తి చేస్తామని పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News