Friday, March 29, 2024

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ట్రాన్స్‌జెండర్ జంట

- Advertisement -
- Advertisement -

కోజికోడ్ : ఇటీవలే గర్భం దాల్చినట్టు ప్రకటించిన కేరళకు చెందిన లింగమార్పిడి ( ట్రాన్స్‌జెండర్ )జంట బుధవారం ఉదయం 9.30 గంటలకు ఇక్కడ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విధంగా ట్రాన్స్‌జెండర్ జంటకు బిడ్డ జన్మించడం దేశం లోనే మొట్టమొదటి సంఘటనగా గుర్తించారు. ప్రస్తుతం తండ్రీ, బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. తండ్రి బిడ్డకు జన్మ నివ్వడం ఏమిటా ? అని అనుకోవద్దు. వీరు లింగమార్పిడి చేసుకున్న దంపతులు. జియా పుట్టుక తోనే మగవాడు కాగా, లింగ మార్పిడి చేయించుకుని స్త్రీగా మారాడు. ఇక జహాద్ పుట్టుక తోనే అమ్మాయి కాగా, లింగమార్పిడితో అబ్బాయిగా మారాలనుకుంది. అందుకోసం ఇదివరకే శస్త్రచికిత్స ద్వారా తన వక్షోజాలను కూడా తొలగించుకుంది. అయితే ఆ తర్వాత ప్రక్రియ జరిగే లోపు గర్భం దాల్చడంతో లింగ మార్పిడి ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేసుకుంది. అయితే ఇప్పుడు ప్రసవించిన బిడ్డ పాపా, బాబా అన్నది వీరు చెప్పడం లేదు.

కొంతకాలం గోప్యంగా ఈ విషయాన్ని ఉంచాలనుకుంటున్నారు. జియా పావల్ ఇటీవలనే ఇన్‌స్టాగ్రామ్ లోకి వెళ్లి జహాద్ ఎనిమిది నెలల గర్భవతి అని ప్రకటించిన సంగతి విదితమే. తల్లిదండ్రులం కావాలని తాము కన్న కలలు ఇప్పుడు సాకారం కాబోతున్నాయని కూడా ప్రకటించారు. భారత్‌లో ఒక ట్రాన్ మాన్ గర్భం దాల్చడం ఇదే తొలిసారి అని తనకు తెలిసిందని పేర్కొన్నారు. జియా పావల్ నృత్యకారిణి. పురుషుడిగా పుట్టి స్త్రీగా లింగ మార్పిడి చేసుకున్నారు. జహాద్ స్త్రీగా పుట్టి పురుషుడిగా మారి పోయారు. వీరిద్దరూ తమ పుట్టుకకు తమ లోని మనిషికి తేడా తెలుసుకున్న తరువాత వారు యుక్త వయసులో కుటుంబాలను విడిచిపెట్టారు. “మూడేళ్ల కిందట మేం కలిసి జీవించడం ప్రారంభించినప్పుడు మా జీవితాలు ఇతర ట్రాన్స్‌జెండర్ల కంటే భిన్నంగా ఉండాలని అనుకున్నాం. చాలా మంది లింగ మార్పిడి జంటలను సమాజంతోపాటు వారి కుటుంబాలు కూడా బహిష్కరించాయి. మేం బిడ్డను కోరుకున్నాం.

తద్వారా మా నుంచి ఏదో ఒక దానిని ప్రపంచానికి ఇస్తున్నాం”అని డాన్స్ టీచర్ అయిన పావెల్ గతంలో వివరించారు. నేను మహిళగా మారడానికి హార్మోన్ల చికిత్స కొనసాగుతోంది. బిడ్డను ప్రసవించిన ఆరు నెలల తరువాత కూడా జహాద్ పురుషుడిగా మారే చికిత్సను తీసుకుంటుంది” అని పావెల్ పేర్కొన్నారు. జియా పావెల్ ది కోజికోడ్ కాగా, అకౌంటెంట్‌గా పనిచేస్తున్న జహాద్‌ది తిరువనంతపురం. లింగమార్పిడి చికిత్సలో వక్షోజాలను జహాద్ తీయించుకోవడం వల్ల ఇప్పుడు ప్రసవించిన బిడ్డకు బ్రెస్ట్ మిల్క్ బ్యాంకు ద్వారా పాలను అందజేయనున్నట్టు కోజికోడ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రి వైద్యులు భరోసా ఇచ్చారు. పుట్టిన బిడ్డకు ట్రాన్స్‌జెండర్ సమాజం స్వాగతం పలుకుతూ ఆనందం వెలిబుచ్చింది. దేశం లోనే మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ పైలట్ ఆడమ్ హారీ తన జీవితంలో ఇలాంటి ఆనందాన్ని ఎప్పుడూ పొందలేదని తన అనుభూతిని ప్రకటించారు. కొత్తగా పుట్టిన బిడ్డ పెరిగిన తర్వాత లింగ నిర్ధారణ బయటపడుతుందన్నారు. ట్రాన్స్‌జెండర్ ఉద్యమ నేత శీతల్ శ్యామ్ తన సోషల్ మీడియాలో ట్రాన్స్‌జెండర్ దంపతుల ఫోటోలను షేర్ చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News