మధ్యాహ్నం ఒంటిగంటకు విడుదల
చేయనున్న సిఎం రేవంత్రెడ్డి ఈసారి
మార్కులతో పాటు గ్రేడింగ్ మెమోలపై
జిపిఎ, మొత్తం మార్కులు ఉండవు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో లక్షలా ది మంది విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠ తో ఎదురుచూస్తోన్న పదో తరగతి పరీక్షల ఫలితా ల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ ఫలితాలను ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి బుధవారం (ఏప్రిల్ 30) మధ్యాహ్నం ఒంటి గంటకు రవీంద్రభారతిలో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ పరీక్షల విభాగం ఓ ప్రకటనలో వెల్లడించింది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు జరిగిన పది పరీక్షలకు దాదాపు 5 లక్షల మందికి పైగా విద్యార్థు లు హాజరయ్యారు. జవాబు పత్రాల మూల్యాంక నం పూర్తి కావడం, మార్కుల మెమోలను ఎలా ఇ వ్వాలన్న అంశంపై పూర్తిస్థాయిలో స్పష్టత రావడంతో అధికారులు ఫలితాల విడుదలకు రంగం సిద్ధం చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను https://results.bse.telangana.org, https://results.bse.telangana.gov.in, https://bse.telangana.gov.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.
సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడింగ్
పదో తరగతిలో ఈసారి కొత్తగా సబ్జెక్టుల వారీగా మార్కులతో పాటు గ్రేడింగ్ కూడా ఇవ్వనున్నారు. ఈ విధనంగా మార్కుల మెమోలు జారీ కానున్నాయి. మార్కుల మెమోలపైనా సబ్జెక్టుల వారీగా రాత పరీక్షలు, ఇంటర్నల్ పరీక్షల మార్కులు, మొత్తం మార్కులు, గ్రేడ్ పొందుపరుస్తారు. అన్ని సబ్జెక్టులలో పొందిన మొత్తం మార్కులు కానీ, జిపిఎ గానీ మెమోలపై ముద్రించరు. చివరకు విద్యార్థి పాసయ్యారా..? ఫెయిల్ అయ్యారా…? అనేది వివరంగా ముద్రిస్తారు. ఇంకా బోధనేతర కార్యక్రమాల(కో కరిక్యులర్ యాక్టివిటీస్)లో విద్యార్థులకు గ్రేడ్లు ఇస్తారు.
సిబిఎస్ఇ తరహాలో మెమోలు
ప్రస్తుతం సిబిఎస్ఇలో సబ్జెక్టులవారీగా మార్కులు, గ్రేడ్లను ముద్రిస్తున్నారు. సిబిఎస్ఇలో అన్ని సబ్జెక్టుల మార్కులు కూడి, మొత్తం ఎన్ని మార్కులో ఇవ్వడం లేదు. రాష్ట్రంలో కూడా అదేవిధానాన్ని అమలు చేయనున్నారు. వాల్యూ ఎడ్యుకేషన్ అండ్ లైఫ్ ఎడ్యుకేషన్, వర్క్ అండ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఆర్ట్ అండ్ కల్చరల్ ఎడ్యుకేషన్, ఫిజికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ అనే నాలుగు కో కరిక్యులర్ యాక్టివిటీస్కు సంబంధించిన గ్రేడ్లు కూడా ముద్రిస్తారు.