కాంగ్రెసోళ్లు రిజర్వేషన్ల గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది: తలసాని
మేడ్చల్: కాంగ్రెస్ ఎంపి ఉత్తమ్ కుమార్రెడ్డి సిగ్గులేకుండా రిజర్వేషన్ల గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీలో సోమవారం టీఆర్ఎస్ ఎన్నికల శంఖారవ భారీ బహిరంగ సభ జరిగింది. రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మేడచ్ల్ మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మలిపెద్ది సుధీర్రెడ్డితో కలిసి మంత్రి తలసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 70 ఏళ్లలో జరగని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కెసిఆర్ సిఎం అయిన తరువాతే ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు.
కాంగ్రెస్ పార్టీ వాళ్లు గాంధీభవన్లో కూర్చొని ఒకరినొకరు తిట్టుకుంటూ టీఆర్ఎస్ వాళ్లను అనడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్లో బిసీలంతా ఒక వైపు మరో సామాజికవర్గం అంతా ఒక్క వైపు ఉన్నారని అన్నారు. బిసిలను, మైనార్టీలను దగ్గరకు కూడా రానివ్వని కాంగ్రెస్ పార్టీ వాళ్లు రిజర్వేషన్ల గురించి మాట్లాడడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. ఉత్తమ్కుమార్ ఆర్మీలో పనిచేశానని చెబుతూనే పోలీసులను తిడుతున్నాడని వాపోయారు. హుజూర్నగర్లో ఓడిపోయారని, ఆర్టిసి కార్మికులను అడ్డం పెట్టుకొని డ్రామాలాడారని అయినా చివరి ఏమి జరిగిందో ప్రజలందరికి తెలుసన్నారు. ఎన్నికలొచ్చాయని బుడ్డర్ఖాన్లు వస్తారని, అధికార పార్టీని తిట్టడమే వారి పనని మంత్రి అన్నారు. అలాంటి వారి మాటలను నమ్మి మోసపోవద్దని కోరారు.
బిజెపి వాళ్లు హిందువులమని గొప్పగా చెప్పుకుంటారని, కానీ ఎక్కడా ఒక్క గుడి కూడా కట్టలేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రిని ప్రపంచంలోనే ఉన్నతమైన దేవాలయంగా తీర్చిదిద్దుతున్నారని, వేముల వాడను అభివృద్ధి చేస్తున్నారని, కేసీఆర్ను మించిన హిందువు ఎవరూ లేరన్నారు. ప్రజలు అభివృద్ధిని చూసే ఓట్లు వేస్తారని పేర్కొన్నారు. కులాలు, మతాలు చూసి ఓట్లు వేయరని ప్రజలు విజ్ఞతతో ఉన్నారని టీఆర్ఎస్ పార్టీనే విశ్వసిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రజలను మోసం చేయడం మానుకోవాలని కాంగ్రెస్ నేతలకు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ హితవు పలికారు.