Wednesday, September 24, 2025

నాయకులుగా మనమే విఫలం అయ్యాం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

* ఓటమిలో మన అధినాయకుడి తప్పు ఏమాత్రం లేదు
* పార్టీ ఓటమిపై మన అందరం ఆత్మ పరిశీలన చేసుకోవాలి
* రైతు ద్రోహి కాంగ్రెస్..ప్రజా ద్రోహి బీజేపీ
* 8మంది ఎంపీలు గెలిచినా తెలంగాణకు వచ్చింది గుండు సున్నా
* దోచుకున్న సొమ్మును ప్రజలకు పంచాలి
* చంద్రబాబు కోసమే మేడిగడ్డను పట్టించుకోని కోవర్టు రేవంత్
-* బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు
* కేటీఆర్ సమక్షంలో తెలంగాణ భవన్ లో బీఆర్‌ఎస్‌లో చేరిన కరీంనగర్ కు చెందిన డాక్టర్ దంపతులు రోహిత్ రెడ్డి – గౌతమి రెడ్డి

మన తెలంగాణ / హైదరాబాద్ : ఓటమిలో మన అధినాయకుడి తప్పు ఏమాత్రం లేదు..నాయకులుగా మనమే విఫలం అయ్యామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. అలవికానీ హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు చేతులు ఎత్తేసిందని, దీనిని మనం విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని కెటిఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తోన్న వేళ బీఆర్‌ఎస్ శ్రేణులకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక పిలుపునిచ్చారు. బుధవారం తెలంగాణ భవన్‌లో కరీంనగర్‌కు చెందిన ప్రముఖ డాక్టర్ దంపతులు ఒంటెల రోహిత్ రెడ్డి, గోగుల గౌతమి రెడ్డి (సీనియర్ గైనకాలజిస్ట్) బుధవారం కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ , కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టారు. పదేళ్ల పాటు మన నాయకుడు కేసీఆర్ బాగా పనిచేశారని, దేశంలో ఏ రాష్ట్రానికి సాధ్యం కాని అనే పనులు చేసి చూపించారని అన్నారు.

రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్ స్టేట్‌గా నిలిపారని, అయినా ఓడిపోయామంటే అందుకు మనమే కారణమన్నారు. మన నాయకుడు బాగా పనిచేశారని, మనమే ప్రజలకు చెప్పుకోవడంలో విఫలం అయ్యామని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. పార్టీ ఓటమిపై మన అందరం ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ గెలవడానికి కారణాలు ఏంటి?, మనం ఓడిపోవడానికి కారణాలు ఏంటి? అనే దానిపై అందరూ ఆరా తీయాలని అన్నారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీల నుంచి 8మంది ఎంపీలు గెలిచినా తెలంగాణకు వచ్చింది గుండు సున్నా అని కెటిఆర్ విమర్శించారు. తెలంగాణ ప్రజలంతా స్థానికంగా ఉన్న తమ బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి ఓడిపోయినా కెసిఆర్ మాత్రం మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని అనుకున్నారని తెలిపారు. అయితే అందరూ అలా అనుకోవడంతోనే కెసిఆర్ సిఎం కాలేకపోయారని కెటిఆర్ చెప్పుకొచ్చారు. బంగారు పళ్లెంలో పెట్టి ఇచ్చిన తెలంగాణను కాంగ్రెస్ నేతలు ఆగమాగం చేశారని మండిపడ్డారు. పకోడీలు అమ్మడాన్ని కూడా ఉద్యోగంగా చెప్పుకోవడం బీజేపీ నేతల మూర్ఖత్వం అన్నారు. శ్రీరాముడు కూడా బీజేపీ మోసాన్ని గ్రహించి అయోధ్యలో ఆ పార్టీని ఓడించారని చెప్పారు.

సామాన్యుడి నడ్డి విరుస్తోన్న బిజెపి : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేస్తుంటే, కేంద్రంలోని బీజేపీ సర్కార్ సామాన్యుడి నడ్డి విరుస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. యూరియా కోసం రోడ్డెక్కిన రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం రేవంత్ రెడ్డి సిగ్గుమాలిన పనితనానికి నిదర్శనమన్నారు. ఇక జీఎస్టీ పేరుతో ఎనిమిదేళ్లుగా ప్రజల నుంచి రూ.15 లక్షల కోట్లు దోచుకున్న ప్రధాని మోడీ, ఇప్పుడు బీహార్ ఎన్నికల కోసం స్లాబులు తగ్గించి పండుగ చేసుకోవాలనడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.

రేవంత్ రెడ్డిది సిగ్గుమాలిన ప్రభుత్వం : అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క పని కూడా చేయలేదని కేటీఆర్ విమర్శించారు. ‘రైతు డిక్లరేషన్‌లో చెప్పిన ఏ ఒక్క హామీని అమలు చేయని రేవంత్ రెడ్డిది సిగ్గుమాలిన ప్రభుత్వం అని విమర్శించారు. యూరియా కోసం రైతులు రోడ్డెక్కితే పోలీసులతో పొట్టు పొట్టు కొట్టిస్తున్నారని, సూర్యాపేటలో యూరియా ఆందోళనలో పాల్గొన్న గిరిజన యువకుడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాష్టికాన్ని మేము వదిలిపెట్టం. ఎస్సీ, ఎస్టీ, మానవ హక్కుల కమిషన్ల దృష్టికి తీసుకు వెళతామన్నారు. రైతులను కొట్టడమేనా రాహుల్ గాంధీ చెప్పిన ’మొహబ్బత్ కీ దుకాణ్’? పాత రోజులు తెస్తానన్న రేవంత్ రెడ్డి అన్నంత పని చేసి, రైతుల కళ్లల్లో కన్నీళ్లు తెప్పిస్తున్నాడని, ఈ దుస్థితి తెలంగాణకు ఎందుకు వచ్చిందో ప్రజలు ఆలోచించాలని అన్నారు.

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం హామీలివ్వడం, వాటిని గాలికొదలడం తప్ప చేసిందేమీ లేదని కేటీఆర్ విమర్శించారు. ‘జీఎస్టీలోని అడ్డగోలు స్లాబులతో 8 ఏళ్లలో రూ.15 లక్షల కోట్లు దోచుకున్నారు. ఇప్పుడు బీహార్ ఎన్నికల కోసం స్లాబులు తగ్గించి, ప్రజలను పండుగ చేసుకోమనడం మోసం కాదా? దోచుకున్న ఆ డబ్బంతా తిరిగి ప్రజలకు చెల్లించాలన్నారు. నల్లధనం తెచ్చి రూ.15 లక్షలు ఇస్తానన్న హామీ ఏమైంది? 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు, పేదలందరికీ ఇళ్లు, బుల్లెట్ రైళ్లు వంటి హామీలను నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు. కానీ దేవుడి పేరు చెప్పి ఎన్నికల్లో గెలుస్తున్నారని, రూ.350 ఉన్న సిలిండర్‌ను రూ.1200, రూ.65 ఉన్న పెట్రోల్‌ను రూ.100 దాటించారన్నారు. వీటి ధరలు తగ్గిస్తే ప్రజలు పండుగ చేసుకుంటారని కెటిఆర్ స్పష్టం చేశారు.

కోవర్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి : మోడీ, చంద్రబాబు ఆడిస్తున్నట్లు ఆడుతున్న కోవర్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కేటీఆర్ ఆరోపించారు. ‘చంద్రబాబు ప్రయోజనాల కోసమే మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేయించకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు 5 మీటర్లు పెంచడానికి రూ.70 వేల కోట్లు ఖర్చు పెడుతుంటే తప్పులేదు గానీ, కేసీఆర్ 40 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.93 వేల కోట్లు ఖర్చు చేస్తే లక్ష కోట్ల అవినీతి జరిగిందని అబద్ధాలు ప్రచారం చేశారన్నారు. రూ.93 వేల కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి ఎలా సాధ్యమో ప్రజలు కూడా ప్రశ్నించలేదని, అవినీతి జరిగి ఉంటే బ్యారేజీలు, పంప్‌హౌస్‌లు, సొరంగాలు ఎవరు కట్టారని కేటీఆర్ నిలదీశారు. గత ఎన్నికల్లో ఓటమికి ప్రజలను నిందించాల్సిన అవసరం లేదని, నాయకులుగా తామే విఫలం అయ్యామని, దేశంలో ఏ ముఖ్యమంత్రీ చేయనంతగా కేసీఆర్ తెలంగాణను అభివృద్ధి చేశారని చెప్పారు.

గంగుల కమలాకర్, వినోద్ కుమార్ కష్టపడి కరీంనగర్‌కు స్మార్ట్ సిటీ తెస్తే కాంగ్రెస్ దాన్ని ఆగం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ గౌతమి రెడ్డి స్ఫూర్తితో విద్యావంతులు, యువత రాజకీయాల్లోకి వచ్చి తెలంగాణను కాంగ్రెస్, బీజేపీల నుంచి కాపాడుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ‘’స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష’ అన్న జయశంకర్ సార్ మాటలను నిజం చేయాలని కోరారు. కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు, నీళ్లు, యూరియా ఎలా వచ్చాయి? కాంగ్రెస్ రాగానే ఎందుకు కరువయ్యాయి? రేవంత్ రెడ్డికి సత్తా లేకపోవడమే ఇందుకు కారణం అని ఆరోపించారు. కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలు కేసీఆర్ ఆపలేదని, తలసరి ఆదాయంలో దేశంలోనే నంబర్ వన్‌గా నిలిపిన రాష్ట్రాన్ని క్యాన్సర్ పేషెంట్ అంటూ రేవంత్ పరువు తీస్తున్నాడని ఆరోపించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిని చేసేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని, కరీంనగర్ ప్రజలు మరోసారి చైతన్యవంతమైన తీర్పు ఇవ్వాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

Also Read: అప్పుడు మాట్లాడింది గుర్తు లేదా..? రెబాపై ఫ్యాన్స్ ఫైర్

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News