మలేషియా జైలులో అన్యాయంగా మగ్గిన ఆరుగురు బాధితుల్లో సోమవారం మరో ముగ్గురు స్వదేశానికి తిరిగి వచ్చారు. నిజామాబాద్ జిల్లా కడెం మండలానికి చెందిన లింగాపూర్ వాసులు రాచకొండ నరేష్, గుండా శ్రీనివాస్, దస్తురాబాద్ మున్యాల్ గ్రామానికి చెందిన యమునూరి రవీందర్ మలేషియా జైలు జీవితం నుంచి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ చొరవతో బయటపడ్డారు. ఇంతకు ముందు గత నెలలో ముగ్గురు బాధితులు తిరిగి రావడం, ఇప్పుడు మరో ముగ్గురు స్వదేశానికి చేరుకోవడంలో కెటిఆర్, ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. జాన్సన్ నాయక్ మలేషియా అధికారులు,
ఇరుదేశాల రాయబార కార్యాలయాలతో నిరంతరం సమన్వయం చేస్తూ స్వయంగా మలేషియా వెళ్లి వచ్చారు. వారి విడుదలకు అవసరమైన ఖర్చులను, విమాన ప్రయాణ చార్జీలను ఆయన భరించారు. జైలు జీవితం నుంచి విడుదలైన సందర్భంగా బాధితులు మాట్లాడుతూ… తాము మలేషియా జైల్లో జీవితం అంతమవుతుందని భావించిన వేళ, తమ ఆవేదనను గుర్తించి తమకు ఆశ కగిలించిన కెటిఆర్కు, మలేషియా వరకు వచ్చి న్యాయవాదులను నియమించి తమ విముక్తికి కృషి చేసిన జాన్సన్ నాయక్కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తాము జీవితాంతం వారికి రుణపడి ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా వారు భావోద్వేగానికి గురయ్యారు.