కరోనా మృతుల కుటుంబాలకు ఇవ్వడానికి కేంద్రం నిర్ణయం, ఎన్డిఆర్ఎఫ్ కింద విపత్తుగా గుర్తింపు
రాష్ట్రాల సిఎస్లకు లేఖ
దేశ వ్యాప్తంగా 86కి చేరిన పాజిటివ్ కేసులు
4వేల మంది అనుమానితులు
ఢిల్లీలో 7, కేరళలో 19 కే సులు నమోదు
అమెరికాలో కరోనా ఎమర్జెన్సీ, కట్టడికి 50బిలియన్ డాలర్లు
చైనాలో మరి 13 మంది మృతి
బెంగాల్లో 31 వరకు పాఠశాలల మూసివేత
మాస్క్లు పంపించండి : భారత్ను కోరిన ఇజ్రాయిల్
ఇరాన్లో మరి 97మంది మృతి 611కు చేరిన మృతుల సంఖ్య
విపత్తుగా ‘కరోనా’కు గుర్తింపు
న్యూఢిల్లీ: ప్రభుత్వ విపత్తు నిధి (ఎస్డిఆర్ఎఫ్) కింద సహాయం అందించాల్సిన, గుర్తించదగ్గ విపత్తుగా కోవిడ్19 (కరోనా)ను పరిగణిస్తున్నామని, కరోనా వల్ల సంభవించే ప్రతి మరణానికి నాలుగు లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లింపు ఉంటుందని కేంద్ర ప్రభుత్వం శనివారం పేర్కొంది. ‘భారతదేశంలో కోవిడ్ 19 వ్యాప్తిని, అది మహమ్మారి అని ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్లూహెచ్ఓ) చేసిన ప్రకటనను దృష్టిలో ఉంచుకొని కేంద్రప్రభుత్వం దీన్ని గుర్తించదగ్గ విపత్తుగా పరిగణిస్తున్నది. ఎస్ఆర్ఆర్ఎఫ్ కింద సహాయం అందించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాం’ అని కేంద్ర హోంమంత్రిత్వశాఖ అన్ని రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు రాసిన లేఖలో పేర్కొంది. కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు, సహాయ కార్యక్రమాల్లో పాల్గొని మరణించిన వారికి (మరణ కారణాన్ని సంబంధిత అధికార యంత్రాంగం సర్టిఫై చేయడం ద్వారా) రూ. 4 లక్షలు ఎక్స్గ్రేషియాను కేంద్రం ప్రకటించింది.