చెన్నై: వరసకు అన్నయ్య అవుతాడని అతనితో సంబంధం వద్దని చెప్పినందుకు… అక్కను తన ప్రియుడితో కలిసి చెల్లెలు హత్య చేసిన సంఘటన తమిళనాడులోని నామక్కల్ ప్రాంతంలో జరిగింది. దీంతో ప్రియుడు, ప్రియురాలిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మోనిశా (19) అనే అమ్మాయి ఇంజినీరింగ్ సెకండియర్ చదువుతోంది. మోనిశా తన ఇంట్లో ఎడమ చేతిని కత్తితో కోసుకొని అపస్మారక స్థితిలో పడి ఉంది. గ్రామస్థులు గమనించి మోనిశాను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయిందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు ఆమె ఆత్మహత్య చేసుకొని ఉంటుందని అందరూ భావించారు. కానీ శవ పరీక్షలో మాత్రం ఆమె ఆత్మహత్య చేసుకోలేదని తేలిందని, గొంతు నులిమి హత్య చేశారని పోలీసులు వెల్లడించారు. కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. మోనిశా చెల్లెలుపై పోలీసులు అనుమానం ఉండడంతో తనదైన శైలిలో ప్రశ్నించారు. తాను, రాహుల్ ప్రేమించుకున్నామని, రాహుల్ తనకు అన్నయ్య వరస అవుతాడని, అతడితో ఎటువంటి సంబంధాలు పెట్టుకోవద్దని మోనిశాతో పాటు తల్లిదండ్రులు హెచ్చరించారు. దీంతో మోనిశా ఒంటరిగా ఉన్నప్పుడు తన ప్రియుడితో కలిసి హత్య చేశానని మోనిశా చెల్లెలు తెలిపింది. దీంతో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.