నిఘా సంస్థలకు ఇంటర్పోల్ హెచ్చరిక
న్యూఢిల్లీ: నకిలీ కొవిడ్-19 వ్యాక్సిన్లపై వ్యాపార ప్రకటనలు గుప్పించి, భౌతికంగా లేక ఇంటర్నెట్ ద్వారా వాటిని విక్రయించడానికి క్రిమినల్ ముఠాలు రంగంలోకి దిగే అవకాశం ఉందని వివిధ దేశాలకు చెందిన నిఘా, దర్యాప్తు సంస్థలను ఇంటర్పోల్ బుధవారం హెచ్చరించింది. లియాన్లో ప్రధాన కార్యాలయం గల ఇంటర్పోల్(అంతర్జాతీయ పోలీసు సహకార సంస్థ) బుధవారం 194 సభ్య దేశాలకు ఆరెంజ్ నోటీసును జారీచేస్తూ కొవిడ్-19 వ్యాక్సిన్, ఫ్లూ వ్యాక్సిన్ల పేరటి తప్పుడు, మోసపూరిత, చట్టవ్యతిరేక ప్రకటనలకు క్రిమినల్ గ్రూపులు ప్రయత్నించవచ్చని పేర్కొంది. కొందరు వ్యక్తులు కూడా తప్పుడు ప్రకటనలతో నకిలీ వ్యాక్సిన్లను అమ్మడానికి ప్రయత్నించవచ్చని ఇంటర్పోల్ తెలిపింది. ప్రజా భద్రతకు ముప్పు అనివార్యమన్న పరిస్థితిలో ఇంటర్పోల్ ఆరెంజ్ నోటీసు జారీచేస్తుంది.
భారత్కు సంబంధించినంత వరకు సిబిఐ నకిలీ వ్యాక్సిన్ను విక్రయించడానికి జరిగే ప్రయత్నాలను అడ్డుకోవడానికి ఇంటర్పోల్తో సమన్వయం చేసుకోవలసి ఉంటుంది. కొవిడ్-19 వ్యాక్సిన్పై బ్రిటన్ ప్రకటన చేసిన రోజే ఇంటర్పోల్ నుంచి ఈ హెచ్చరిక రావడం గమనార్హం. నకిలీ వ్యాక్సిన్లపై ప్రకటనలు చేసే నకిలీ వెబ్సైట్లపై కన్నేసి ఉంచాలని ఇంటర్పోల్ కోరింది. నకిలీ వెబ్సైట్ల ద్వారా ప్రజలకు నకిలీ వ్యాక్సిన్లను అమ్మే క్రిమినల్ గ్యాంగులపై అప్రమత్తంగా ఉండాలని, ఈ రకమైన వ్యాక్సిన్ల వాడకం వల్ల ప్రజల ప్రాణాలకే ప్రమాదమని కూడా ఇంటర్పోల్ హెచ్చరించింది. నకిలీ మందులు, వైద్య పరికరాలను విక్రయించే ఆన్లైన్ ఫార్మసీలకు సంబంధించిన 3,000 వైబ్సైట్లను ఇంటర్పోల్ సైబర్క్రైమ్ గుర్తించింది. వీటిలో 1700 వెబ్సైట్ల నుంచి సైబర్ ముప్పు పొంచి ఉన్నట్లు కూడా ఇంటర్పోల్ గుర్తించింది.