* బల్లూ నాయక్ తండాలో విషాదం
* బావిలో క్రేన్ పడి ఇద్దరు మృతి.. మరో ఇద్దరికి తీవ్రగాయాలు
హుస్నాబాద్ : వ్యవసాయ బావి పూడిక తీస్తుండగా ప్రమాదవశాత్తు క్రేన్ బావిలో పడి ఇద్దరు మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం బల్లూనాయక్ తండాలో చోటుచేసుకుంది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా మెరుగైన చికిత్స నిమిత్తం వరంగల్ ఆస్పత్రికి తరలించారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హుస్నాబాద్ మండలం బల్లూ నాయక్ తండా గ్రామానికి చెందిన లావుడ్య దేవోజీ, లావుడ్య దుర్గ పొత్తుల వ్యవసాయ బావిని క్రేన్ సహాయంతో పూడిక తీసేందుకు పనులు చేపట్టారు. గురువారం పూడిక తీస్తున్న క్రమంలో బావిలో పెద్ద బండరాయి వచ్చింది దానిని క్రేన్ డబ్బా ద్వారా పైకి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా బరువు అధికం కావడంతో క్రేన్ బావిలో పడిపోయింది.
క్రేన్ నడుపుతున్న లావుడ్య చాంది(45) క్రేన్తో సహా బావిలో పడడంతో అక్కడిక్కడే మృతి చెందగా, బావిలో పని చేస్తున్న లావుడ్య భీమా(56), ఇస్లావత్ వెంక్యా, లావుడ్య సరోజనలు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే మృతదేహంతో పాటు గాయపడిన వారిని వెలికి తీసి చికిత్స నిమిత్తం హుస్నాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా లావుడ్య భీమా మార్గమధ్యంలో చనిపోయాడు. వెంక్యా, సరోజనను వరంగల్ ఎంజీఎంకు తరలించారు. దేవోజి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీధర్ తెలిపారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్త హుస్నాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.