రాహుల్, ప్రియాంకతో బఘేల్ భేటీ
ప్రభుత్వానికి ఢోకా లేదని కామెంట్
న్యూఢిల్లీ: చత్తీస్గఢ్లో ముఖ్యమంత్రి మార్పు వ్యవహారం తారాస్థాయికి చేరుకున్నది. ప్రస్తుతం సిఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న భూపేశ్బఘేల్ శుక్రవారం మరోసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతోపాటు ప్రియాంకాగాంధీతో భేటీ అయ్యారు. సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలోని రాహుల్ నివాసానికెళ్లి నాయకత్వ మార్పు వ్యవహారంపై చర్చించారు. ఆ సమయంలో చత్తీస్గఢ్ కాంగ్రెస్ ఇంచార్జ్ పిఎల్ పూనియా కూడా అక్కడే ఉన్నారు. ఈ వారంలో రాహుల్ను బఘేల్ కలవడం ఇది రెండోసారి. మంగళవారం ఓవైపు బఘేల్తో మాట్లాడిన రాహుల్, మరోవైపు ఆయన ప్రత్యర్థి, ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖమంత్రి టిఎస్ సింగ్డియోతోనూ మంతనాలు జరిపారు. చత్తీస్గఢ్కు చెందిన వీరిరువురూ బుధవారం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్తోనూ చర్చించారు.
బఘేల్కు మద్దతు తెలిపే మంత్రులు, ఎంఎల్ఎలు కూడా ఢిల్లీకి చేరి లాబీయింగ్ నడుపుతున్నారు. దాదాపు 50మంది ఎంఎల్ఎలు సిఎం మార్పు అవసరం లేదని రాహుల్ దృష్టికి తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. తమ పార్టీకి చెందిన 70మంది ఎంఎల్ఎలు ఐక్యంగా ఉన్నారని, తన ప్రభుత్వానికి ఢోకా లేదని రాహుల్తో భేటీ అనంతరం బఘేల్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, నాయకత్వ సమస్య ఉన్నదని, అది తాము పరిష్కరించాల్సి ఉన్నదని పిఎల్ పూనియా మీడియాతో అనడంతో అంతర్గత సంక్షోభాన్ని అంగీకరించినట్టయింది. 2018 ఎన్నికల్లో చత్తీస్గఢ్లో అధికారం చేపట్టిన కాంగ్రెస్లో అధికారం కోసం పెనుగులాట మొదలైంది. ఆ సమయంలో ఇరువురు నేతలకు చెరిసగం కాలం అధికారం పంచడానికి ఒప్పించి ఐక్యం చేసినట్టు వార్తలొచ్చాయి. ఆ లెక్కన ఈ ఏడాది జూన్లో బఘేల్ సిఎం పదవిని వీడాల్సి ఉండగా, అది జరగలేదు. దాంతో వివాదం అధిష్ఠానం వద్దకు చేరింది.