దాదాపు 11 ఏళ్ల నాటి కేసులో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్ఎల్ఎలతో సహా 9 మంది దోషులకు ఏడాది జైలు శిక్ష పడింది. అయితే వారందరికీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ తీర్పుపై హైకోర్టులో అప్పీలు చేసుకునేందుకు నెల గడువు ఇచ్చింది. 2014 ఆగస్టు 13న జైపూర్ లోని రాజస్థాన్ యూనివర్శిటీ ప్రధాన ద్వారం బయట జేఎల్ఎస్ మార్గాన్ని సుమారు 20 నిమిషాల పాటు నిరసనకారులు దిగ్బంధించారు. ఈ నిరసన సందర్భంగా చట్టవిరుద్ధంగా సమావేశమై ప్రజా రహదారిని అడ్డుకున్నందుకు పోలీసులు కేసు నమోదు చేశారు.
2016ఆగస్టు 11న ఛార్జిషీట్ కోర్టులో దాఖలు చేశారు. దీనిపై 11 ఏళ్లుగా కోర్టులో విచారణ సాగింది. జైపూర్ జిల్లా కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. జైలు శిక్ష పడిన 9 మందిలో లడ్నన్ కాంగ్రెస్ ఎమ్ఎల్ఎ ముఖేశ్ భాకర్, షాపురాకు కాంగ్రెస్ ఎమ్ఎల్ఎ మనీష్ యాదవ్, జోత్వారా అసెంబ్లీ స్థానానికి చెందిన మాజీ కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ చౌదరి ఉన్నారు. అయితే దోషిగా నిర్ధారించిన ఇద్దరు కాంగ్రెస్ నేతల అసెంబ్లీ సభ్యత్వంపై ఎలాంటి ప్రభావం ఉండదు. ప్రస్తుత చట్టప్రకారం జైలుశిక్ష రెండేళ్లకు మించితేనే ఎంపీ, ఎమ్ఎల్ఎల సభ్యత్వం రద్దవుతుంది.