రాయలసీమ ప్రాంతానికి సాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన బనకచర్ల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం (Banakacharla Lift Irrigation Scheme) ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాస్పద అంశంగా మారింది. రాష్ట్రవిభజన తర్వాత గోదావరి -కృష్ణా జలాల వినియోగంపై తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న ఉద్వేగపూరిత పోరాటానికి బనకచర్ల ప్రాజెక్టు తాజా ఉదాహరణగా మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి -బనకచర్ల లింక్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రస్తుతం తీవ్ర వివాదానికి దారితీసింది. ఒకవైపు ఇది రాయలసీమ సాగునీటి అవసరాల తీర్చడానికని ఎపి వాదిస్తుండగా, మరోవైపు అనుమతులు లేకుండానే ప్రాజెక్టును ప్రారంభించడంపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తెలంగాణ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై పోలవరం, పత్యరేడు, గాలేరు నగరి, వేలు గోడు వంటి ప్రాజెక్టుల విషయంలో అనుమతులలేమిపై నిరసన వ్యక్తం చేస్తోంది.
ఇక బనకచర్ల లిఫ్ట్ (Banakacharla Lift) కూడా అదే కోవలోనిదే. గోదావరి నుంచి సముద్రంలోకిపోతున్న నీటిని ఎత్తిపోసి నంద్యాల జిల్లా బనకచర్ల వరకు తీసుకువచ్చే ఉద్దేశంతో ఈ లింక్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇది పూర్తిగా ఎత్తిపోతల పథకంగా రూపొందించబడింది. గోదావరి నుంచి నీటిని తీసుకొని కృష్ణా నదీ పరీవాహక ప్రాంతమైన రాయలసీమకు తరలించాలన్నదే దీని లక్ష్యం. బనకచర్ల లిఫ్ట్ ప్రాజెక్టు, కృష్ణా నదిపై ఉన్న సంజీవయ్య సాగర్ (వెలిగొండ జలాశయం) వద్ద నుండి నీటిని ఎత్తిపోసి ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సాగునీటిగా వినియోగించాలనే ఉద్దేశంతో రూపొందించబడింది. ఇది ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి నీటి అవసరాలను తీర్చడానికే లక్ష్యంగా ఉంది. ప్రాజెక్టు ద్వారా నెల్లూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో కొత్తగా 7.4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతోపాటు, ఇప్పటికే సాగులోఉన్న 22.6 లక్షల ఎకరాలకు స్థిరీకరణ చేయనున్నారు. పథకాన్ని పురోగతిలో పెట్టేందుకు 9,600 కోట్ల రూపాయల టెండర్లు మే 2024లోనే విడుదల చేయడమే కాకుండా, పనులు ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు.
అయితే ఈ ప్రాజెక్టుపై నైతిక, న్యాయ, పారిశ్రామిక, పర్యావరణపరంగా అనుమతుల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖనుంచి టెక్నికల్ క్లియరెన్స్, కేంద్ర పర్యావరణశాఖనుంచి పర్యావరణ అనుమతులు, కేంద్ర జలకమిషన్ (సిడబ్లుసి), గోదావరి నది నిర్వహణ మండలి (జిఆర్ఎంబి), రెండు రాష్ట్రాల సమన్వయ సంస్థ అయిన ఏపెక్స్ కౌన్సిల్నుండి ఎలాంటి అంగీకారం లేకుండానే ఎపి ప్రాజెక్టును చేపట్టింది. ఇది ఏకపక్షచర్యగా భావిస్తూ తెలంగాణ రాష్ట్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా నాలుగు విషయాల్లో అభ్యంతరాలు తెలియజేసింది. మొదటిది ఇది చట్టఉల్లంఘన. 2014లో అమలులోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య నీటి వినియోగానికి సంబంధించి ఏవైనా ప్రాజెక్టులు ప్రారంభించడానికి కేంద్ర అనుమతులతోపాటు ఎపెక్స్ కౌన్సిల్ అంగీకారం తప్పనిసరి. రెండవది ఈ లింక్ ప్రాజెక్టు వల్ల గోదావరిలో ప్రవాహం తగ్గి తెలంగాణలోని ములుగు, భూపాలపల్లి, మానుగూరు ప్రాంతాలలో బాక్వాటర్ ప్రభావంతో వరద ముప్పు పెరిగే అవకాశం ఉంది.
మూడవది – కృష్ణా జలాలపై ఇప్పటికే అన్యాయం జరుగుతుంటే, మరింత నీటిని డైవర్ట్ చేయడం అన్యాయమని తెలంగాణ అభిప్రాయం. నాలుగవది కేంద్రం నిష్పక్షపాతంగా వ్యవహరించకపోవడంవల్లే ఎపికి కొంత ధైర్యం వచ్చినట్టు తెలంగాణ నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణ నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపై స్పష్టమైన వైఖరి ప్రకటించారు. ఇది తెలంగాణ రైతుల హక్కులపై దాడిగా పేర్కొంటూ కేంద్రాన్ని పలుమార్లు అప్రమత్తం చేశారు. ఇప్పటికే కేంద్ర జలవనరుల మంత్రికి, గోదావరి నది నిర్వహణ మండలికి, జలశక్తి మంత్రిత్వశాఖకు లేఖలు పంపారు. గోదావరిలో ఏటా సుమారు 3,000 టిఎంసిల నీరు సముద్రంలో కలుస్తుంది. ఎపి ప్రతిపాదించిన ప్రాజెక్టు ద్వారా దాదాపు 200 టిఎంసిలు మాత్రమే ఎత్తిపోసి రాయలసీమకు తరలించాలన్నదే ప్రధాన ఉద్దేశం. దీనిని ‘పోయే నీటిని వినియోగించు కుంటున్నాం’ అనే పేరుతో సమర్ధించుకుంటున్నారు. కానీ ఇందులోను ఓ వ్యాజ్యం ఉంది.
1980లో ఏర్పడిన గోదావరి జలాల తత్వ విచారణ కమిటీ (జిడబ్లుడిటి) తీర్పుల ప్రకారం, ఏ ఒక్క రాష్ట్రం కూడా ఇతర రాష్ట్ర అంగీకారం లేకుండా గోదావరి నీటిని వేరే బేసిన్కు తరలించలేదు. ఇది న్యాయపరంగా మాత్రమే కాదు, సాంకేతికంగా, పర్యావరణపరంగా కూడా తీవ్ర పరిణామాలను కలిగించే అంశం. ఎత్తిపోతల ద్వారా 250 మీటర్ల ఎత్తువరకు నీటిని తరలించాలి. ఇందుకోసం విద్యుత్ వినియోగం, పారిశ్రామిక నిర్మాణం, బాక్వాటర్ ప్రభావం వంటి అంశాలు వివరంగా పరిశీలించాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు Detailed Project Report (DPR), Environmental Impact Assessment (EIA) వంటి కీలక నివేదికలు అందుబాటులో లేవు. ఇక కేంద్రం పాత్ర విషయానికి వస్తే, అది ఇప్పటికీ స్పష్టత ఇవ్వకుండా రెండు రాష్ట్రాలకు మధ్య వివాదాన్ని పెంపొందించేలా వ్యవహరిస్తోంది. రెండు రాష్ట్రాలు ఒకే నదిని పంచుకుంటున్నప్పుడు కేంద్రం నిష్పక్షపాత ధోరణితో మెలగాల్సిన, వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కానీ ప్రస్తుతం కనిపిస్తున్న పరిణామాలు రాజకీయ పక్షపాతం, ప్రాంతీయ ఒత్తిళ్లకు లోనవుతున్నట్టు అనిపిస్తోంది.
సంపూర్ణంగా చూస్తే బనకచర్ల ప్రాజెక్టు అవసరం కలిగిన ప్రాంతానికి నీరు అందించాలన్న మంచి ఉద్దేశంతో ప్రారంభమైనా, పారదర్శకత, చట్టపరమైన ప్రక్రియలు, పర్యావరణ ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ఈ ప్రాజెక్టు వ్యతిరేకతకు గురవుతోంది. ఒక రాష్ట్రం నీటి ప్రాజెక్టును కొత్తగా ప్రారంభించడమంటే అది పరస్పర అపనమ్మకానికి, నదీ జలాల పంచాయితీకి, అవకాశం లేకుండా ఉండాలి. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తమతమ ఆవశ్యకతలు సమర్పించుకుని, కేంద్ర ప్రభుత్వం పారదర్శక విచారణతో తేల్చాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం నీటిప్రాజెక్టు అనేగాక, నీటి రాజకీయం, న్యాయం, సహకార పద్ధతుల పరీక్షగా భావించాలి. బనకచర్ల లిఫ్ట్ ప్రాజెక్టు దక్షిణ ఆంధ్రప్రదేశ్కు సాగునీటి శాపమా, లేక తెలంగాణకు నదీ హక్కుల అపహరణ అనే ప్రశ్న ఇప్పటికీ తేలలేదని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన నిబంధనలు అమలు చేయకుంటే రెండు రాష్ట్రాలకు మధ్య సంఘర్షణ కొనసాగే అవకాశం ఉంది. జలాలపై సమన్వయ, పారదర్శకత, న్యాయబద్ధమైన వాటా నిర్ణయాలు కేంద్రం ద్వారా తీసుకోవడం అత్యవసరం. రాష్ట్రాలు పరస్పరం నమ్మకం కలిగి పరిష్కార మార్గాలను అన్వేషించాల్సిన అవసరం అనివార్యంగా ఉంది.
- రామ కిష్టయ్య సంగనభట్ల, 94405 95494