లీడ్స్: ఐదు టెస్ట్ల సిరీస్లో భాగంగా హెడ్డింగ్లే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో టీం ఇండియా (Ind VS Eng) ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్కి దిగిన భారత బ్యాట్స్మెన్లు అదిరిపోయే బ్యాటింగ్ చేశారు. మొదటి రోజే ఓపెనర్ యశస్వీ జైస్వాల్, శుభ్మాన్ గిల్లు సెంచరీలు చేశారు. రెండో రోజు 359 పరుగుల ఓవర్నైట్ స్కోర్తో బ్యాటింగ్ ఆరంభించిన భారత బ్యాట్స్మెన్లు శుభ్మాన్ గిల్, రిషబ్ పంత్లు ఇంగ్లండ్ బౌలర్లను తిప్పలు పెట్టారు. ఈ క్రమంలో పంత్ కూడా సెంచరీ సాధించాడు.
అయితే 147 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద శుభ్మాన్ ఔట్ అయ్యాడు. ఈ క్రమంలో బ్యాటింగ్కి వచ్చిన కరుణ్ నైయర్ నిరాశపరిచాడు. నాలుగు బంతులు మాత్రమే ఎదురుకొని డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత కొంత సమయానికే పంత్ (134) జోష్ టంగ్ బౌలింగ్లో ఎల్బిడబ్ల్యూగా వెనుదిరిగాడు. అనంతరం బ్యాటింగ్కి వచ్చిన వారెవరూ బ్యాటింగ్లో పట్టుబిగించలేకపోయారు. రవీంద్ర జడేజా 11 మినహా మిగితా వారందరూ సింగిల్ డిజిట్ స్కోర్కే (బుమ్రా డకౌట్) పరిమితం అయ్యారు. దీంతో భారత్ (Ind VS Eng) 113 ఓవర్లలో 471 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బౌలింగ్లో జోష్ టంగ్, బెన్ స్టోక్స్ చెరి నాలుగు, బషీర్, కార్సే తలో వికెట్ తీశారు.