Wednesday, June 25, 2025

ఇరాన్ పాశుపతాస్త్రం.. హర్మూజ్

- Advertisement -
- Advertisement -

ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అగ్రరాజ్యం అమెరికా ఊహించిన దానికన్నా ముందుగానే ప్రవేశించడమే కాకుండా ఇరాన్ అణుస్థావరాలపై భీకర దాడులకు దిగడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఇంతవరకు ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పోరుగానే ఉన్న ఈ యుద్ధం ఇప్పుడు అమెరికా రంగప్రవేశంతో మూడో ప్రపంచ యుద్ధానికి లేదా అణుయుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందా అనే భయాలు వ్యక్తమవుతున్నాయి. ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఇరాన్‌పై దాడి చేసే విషయంపై రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటానని చెప్తూ వచ్చిన ట్రంప్ ఆ ప్రకటన చేసిన రెండు రోజులకే హటాత్తుగా ఇరాన్ అణుస్థావరాలపై మెరుపుదాడులు చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ దాడి జరిగిన తర్వాత ఇరాన్ తమ అణుస్థావరాలపై దాడి చేయడం ద్వారా అమెరికా ‘పెద్ద రెడ్‌లైన్’ను దాటేసిందని, దీనికి ఆ దేశం శాశ్వతమైన ప్రతిఫలాన్ని అనుభవించక తప్పదని కూడా హెచ్చరించింది.

ఇంతకీ భారత్- పాకిస్థాన్ మధ్య అణుయుద్ధం సంభవించకుండా తానే చొరవ తీసుకుని ఇరుదేశాలను కాల్పుల విరమణకు అంగీకరింపజేశానని, నోబెల్ శాంతి బహుమతి తనకే దక్కాల్సి ఉందంటూ గొప్పలు చెప్పుకుంటూ వచ్చిన ట్రంప్ మహాశయుడు ఇప్పుడు తానే స్వయంగా ఇరాన్‌పై ప్రత్యక్ష దాడులకు దిగడం ద్వారా మరో భీకర యుద్ధానికి ఎందుకు తెరదీశారనేది ఎవరికీ అర్థం కాని ప్రశ్న. ఇరాన్ అణ్వస్త్రాలను సమకూర్చుకోకుండా చేయడం కోసమే తాము ఈ దాడి చేశామని ట్రంప్ చెప్పుకోవచ్చు కానీ అందులో పూర్తి నిజం లేదని ప్రపంచ దేశాలన్నిటికీ తెలుసు. ఎందుకంటే ఇరాన్ చాలా సంవత్సరాలుగా యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. అంతేకాదు, ఏ క్షణంలోనైనా అణ్వస్తాన్ని తయారు చేయగల స్థితిలో ఉందని అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు సైతం అంటున్నాయి. అందుకే అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంలో చేరాలని ఇరాన్‌పై ట్రంప్ తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తూనే ఉన్నారు. ఈ దిశగా ఇరుదేశాల మధ్య ఆరేడు విడతలుగా చర్చలు కూడా జరిగాయి.

ఈ దశలో ఇరాన్ అణు స్థావరాలను ధ్వంసం చేసే విధంగా భీకర దాడులకు దిగడంతో ఆ అవకాశాలు చేజారినట్లే. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక చట్టంనుంచి వైదొలగుతామని ఇరాన్ హెచ్చరించడమంటే తనకు నచ్చిన విధంగా అణు ఇంధనాన్ని శుద్ధి చేసుకోగలుగుతుంది. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ(International Atomic Energy Agency) (ఐఎఇఐ)వంటి సంస్థల పర్యవేక్షణను కూడా అనుమతించదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇరాన్ మరింత వేగంగా అణ్వాయుధాలను తయారు చేసుకునే అవకాశం లభిస్తుంది.అయితే ఇరాన్ అంతటి సాహసం చేసే స్థితిలో ఇప్పుడు ఉందా అనేదే ప్రశ్న. గతంలో ఇరాన్ ఇజ్రాయెల్ ఘర్షణల సమయంలో ఏ దేశం ఎటువైపు ఉందో స్పష్టంగా తెలిసేది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడంలేదు. ఇరాన్‌పై అమెరికా దాడులను రష్యా, చైనాలు తీవ్రంగా ఖండించాయి. అయితే ఈ రెండు దేశాలు ఇరాన్‌కు నేరుగా సైనిక సాయం చేసే స్థితి లేదు.

టర్కీ, ఖతార్, సౌదీఅరేబియా లాంటి గల్ఫ్‌దేశాల పరిస్థితి కూడా అలానే ఉంది. గతంలో ముస్లిం దేశాలన్నీ ఇరాన్‌కు అండగా నిలిచాయి. కానీ ఇప్పుడు అవి ప్రత్యక్షంగా ఇరాన్‌కు మద్దతుగా నిలిచేలా కనిపించలేదు. మరోవైపు భారత్ సహా పలు ఆసియా దేశాలు సైతం ఇరుపక్షాలకూ దూరంగా ఉంటున్నాయి. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సలహా ఇస్తున్నాయి. కానీ ఆ సలహాను అవి ఎంతమేరకు పాటిస్తాయనేది సందేహమే. ఇక ఇరాన్‌కు ఉన్న ఏకైక తురుపుముక్క హర్మూజ్ జలసంధిని మూసివేయడం. ప్రపంచంలో సముద్ర మార్గం ద్వారా రవాణా అయ్యే చమురులో 25 శాతం ఈ జలసంధి ద్వారానే సరఫరా అవుతుంది. కేవలం 33 కిలోమీటర్లు వెడల్పు ఉండే ఈ ఇరుకైన జలమార్గం గుండా వెళ్లే చమురు రవాణా నౌకలను అడ్డుకుంటే ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరిగిపోయే ప్రమాదం పొంచిఉంది. పెట్రోల్, డీజిల్ ధరల మంటలు ఎగసిపడితే ప్రపంచం ఆర్థికంగా దెబ్బతినడం ఖాయం.

ఈ భయాలను బూచిగా చూపించి తమపై దాడులను ఆపాలని అమెరికా, ఇజ్రాయెల్ కూటమి దేశాలను ఇరాన్ హెచ్చరించే వీలుంది. మరో వైపు కువైట్, బహ్రెయిన్, ఖతార్, యుఎఇ వంటి గల్ఫ్ దేశాల్లోని అమెరికా వైమానిక స్థావరాలపై మెరుపుదాడులు చేసి ప్రతిదాడులను నిలువరించే అవకాశం ఉంది. ఈ భయంతోనే అమెరికా ఇప్పటికే ఒకటి, రెండు స్థావరాలనుంచి తమ యుద్ధవిమానాలను వేరే చోటికి తరలించినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇరాన్‌లో ప్రభుత్వాన్ని మార్చడం తమ లక్షం కాదని, దాని అణు సామర్థాన్ని దెబ్బతీయడమే ప్రధాన లక్షమని అమెరికా, ఇజ్రాయెల్‌లు చెప్తూ ఉండడం గమనార్హం. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చేతులనుంచి పాలనను తప్పించి తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలనేదే అమెరికా ప్రధాన ఉద్దేశమని అంతర్జాతీయ విశ్లేషకులు అంటున్నారు.

అన్నిటికన్నా మించి రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టినప్పటినుంచి పలు వివాదాస్పద నిర్ణయాల ద్వారా ఇటు స్వదేశంలో, అటు ప్రపంచం దృష్టిలో బోలెడంత అపకీర్తిని మూటగట్టుకున్న ట్రంప్ మరింత దుందుడుకు చర్యలకు దిగుతారా? అన్నది ప్రధాన ప్రశ్న. ఓ వైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం, మరోవైపు గాజా సంక్షోభం సమస్యల్లో మధ్యవర్తిత్వానికి యత్నించి అవి ఫలించని నేపథ్యంలో ఈ రెండింటికన్నా క్లిష్టమైన ఇరాన్ ఇజ్రాయెల్ వివాదంలో తలదూర్చి కొరివితో తలగోక్కుంటారా? అయితే గతంలో ట్రంప్ పాలనను చూసిన చాలా మంది ఆయన సమస్యలను కొనితెచ్చుకోవడంలో సిద్ధహస్తుడని, ఇప్పుడు కూడా ఏమి చేస్తారో ఎవరూ ముందుగా ఊహించలేరని అంటున్నారు. అయితే పరిస్థితి అణుయుద్ధానికో, మూడో ప్రపంచ యుద్ధానికో దారి తీయకపోవచ్చని, అతి త్వరలోనే ఇరుపక్షాలు వాస్తవాన్ని అర్థం చేసుకుని ఓ అడుగు వెనక్కి వేస్తాయని మెజారిటీ విశ్లేషకుల అభిప్రాయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News