ఈ ఏడాది ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ 7 వరకు భారత్ లో పురుషుల హాకీ ఆసియా కప్ 2025 జరగనుంది. ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ హాకీ జట్టు కూడా పాల్గొనున్నట్లు తెలుస్తోంది. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ జట్టు.. భారత్ లో పర్యటించడంపై సందేహాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో హాకీ ఆసియా కప్ లో పాక్ పాల్గొనడంపై క్రీడా మంత్రిత్వ శాఖ వర్గాలు స్పందిస్తూ..” పలు జాతీయ పోటీల్లో ఇండియాలో పోటీ పడే ఏ జట్టుకు మేము వ్యతిరేకం కాదు. కానీ ద్వైపాక్షికం భిన్నంగా ఉంటుంది. అంతర్జాతీయ క్రీడలు పోటీ నుండి మనం వెనక్కి తగ్గకూడదని డిమాండ్ చేస్తున్నాయి. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో ఉన్నాయి.. కానీ అవి బహుళ జాతీయ ఈవెంట్లలో కనిపిస్తాయి” అని తెలిపాయి. కాగా, పాకిస్తాన్ హాకీ జట్టు చివరిసారిగా 2023లో ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా భారత్ లో పర్యటించింది. ఈ ట్రోఫీలో పాక్ ఐదవ స్థానంలో నిలిచింది.
ఆసియా కప్లో తలపడనున్న 8 జట్లు
ఆసియా కప్ విషయానికొస్తే, భారత్, పాకిస్తాన్తో సహా మొత్తం 8 జట్లు పాల్గొననున్నాయి. చైనా, జపాన్, మలేషియా, పాకిస్తాన్, దక్షిణ కొరియా వంటి ఐదు జట్లతోపాటు ఆతిథ్య దేశంగా టోర్నమెంట్కు భారత్ అర్హత సాధించింది. ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన AHF కప్లో ఫైనల్కు చేరుకున్న ఒమన్, చైనీస్ తైపీ ఈ టోర్నమెంట్కు అర్హత సాధించాయి. ఈ టోర్నమెంట్ విజేత వచ్చే ఏడాది జరగనున్న పురుషుల FIH హాకీ ప్రపంచ కప్కు అర్హత సాధిస్తుంది. కాబట్టి పాల్గొనే అన్ని జట్లకు ఆసియా కప్ చాలా ముఖ్యమైనది.
మూడుసార్లు హాకీ ఆసియా కప్ భారత్ కైవసం
2022లో జరిగిన గత ఎడిషన్ ఆసియా కప్ విజేతగా నిలిచిన దక్షిణ కొరియా రికార్డు స్థాయిలో ఐదుసార్లు ఈ కప్ ను సాధించింది. మలేషియా రన్నరప్గా నిలవగా, జపాన్ను ఓడించి భారత్ మూడవ స్థానంలో నిలిచింది. కాగా, మొత్తం మూడుసార్లు భారత్ ఆసియా కప్ను గెలుచుకుంది. భారత్ 2017లో జరిగిన ఫైనల్లో మలేషియాను ఓడించి విజేతగా నిలిచింది. ప్రస్తుతం జరగనున్న మెగాటోర్నీలో సత్తా చాటి.. నాలుగోసారి ఆసియా ట్రోఫీని దక్కించుకోవాలని భారత్ భావిస్తోంది.