వాషింగ్టన్: గాజాలో పరిస్థితులు రోజురోజుకూ దుర్భరంగా మారుతున్నాయి. ఆహారం దొరక్క ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. అక్కడి చిన్నారుల్లో పౌష్టికాహార లోపం స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ పౌరుల పరిస్థితి అంతే. ఇటీవల అక్కడి బందీలకు సంబంధించిన పలు దృశ్యాలు, వీడియోలు బయటకు వచ్చాయి. వాటిలో ఇజ్రాయెలీలు ఎముకల గూళ్లుగా మారిన శరీరాలతో దారుణ స్థితిలో కనిపించడం అక్కడి పరిస్థితులకు అద్దం పడుతోంది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు.
గాజా ప్రజల ఆకలి తీర్చాలనుకుంటున్నట్టు చెప్పారు. కేవలం అమెరికా మాత్రమే ఆ పని చేయగలదన్నారు. హమాస్పై ఇజ్రాయెల్ ప్రతిస్పందనను నరమేధంగా భావిస్తున్నారా? అని ట్రంప్ను విలేకరులు ప్రశ్నించగా, దానిని నరమేధంగా తాను భావించడం లేదని, హమాస్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నది యుద్ధమేనని అన్నారు. 2023 అక్టోబర్ 7 న హమాస్ చేపట్టిన దుందుడుకు చర్యవల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తాయన్నారు. హమాస్ దాడిలో కొన్ని భయానక సంఘటనలు జరిగాయని చెప్పారు. “ గాజా ప్రజల కడుపు నింపాలనుకుంటున్నాం. కేవలం అమెరికా వల్లే అది సాధ్యమవుతుంది. దీనికోసం ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయిస్తున్నాం. గాజా లోని సామాన్య ప్రజలకు ఇజ్రాయెల్ అధికారులే నేరుగా ఆహారం అందించాలని కోరుకుంటున్నాం. లేదంటే పరిస్థితులు మరింత విషమించే అవకాశం ఉంది. అప్పుడప్పుడూ కొన్ని దుర్ఘటనలు జరుగుతుంటాయి. అలాగని ఎవరూ ఆకలితో అలమటించడం మాకిష్టం లేదు.” అని ట్రంప్ పేర్కొన్నారు.
జీహెచ్ఎఫ్పై ఐరాస మండిపాటు
మరోవైపు గాజా మానవతా నిధి (జీహెచ్ ఎఫ్) తీరును ఐక్యరాజ్యసమితి (ఐరాస) తప్పుబట్టింది. జీహెచ్ఎఫ్ చేపట్టిన సహాయక చర్యలు గాజా ప్రజలను ప్రమాదం లోకి నెట్టి వేస్తున్నాయని మండిపడింది. జీహెచ్ఎఫ్ ఆధ్వర్యం లోని ఆహార పంపిణీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలు, అక్కడికి వచ్చిన వారిని లక్షంగా చేసుకుని ఇజ్రాయెల్ దళాలు జరిపిన కాల్పుల్లో మే నుంచి ఇప్పటివరకు 1000 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ఐరాస పేర్కొంది.