ఇది విరమణ కాదు.. విరామం మాత్రమే
బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు
ఇవ్వకపోతే రణరంగాన్ని సృష్టిస్తాం
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,
బిఆర్ఎస్ ఎంఎల్సి కల్వకుంట్ల కవిత
కవిత దీక్షకు ఐఎన్ఎల్డీ మద్దతు
భారీ ఎత్తున తరలివచ్చిన బిసి సంఘాల నాయకులు
మనతెలంగాణ/హైదరాబాద్ : స్థానిక సంస్థల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకపోతే రణరంగాన్ని సృష్టిస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బిఆర్ఎస్ ఎంఎల్సి కల్వకుంట్ల కవిత తేల్చిచెప్పారు. ఇది రాజకీయ పోరాటం కాదు..బిసిల ఆత్మగౌరవం కొసం చేస్తున్న పోరాటం అని స్పష్టం చేశారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లులో ముస్లీంలకు కూడా వాటా ఉందన్న అనుమానం ఉన్నందున దాన్ని ఆపుతున్నామని బిజెపి నాయకులు చెబుతున్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందులో భాగంగా బిసిలకు 42 శాతం రిజర్వేషన్లతో పాటు ముస్లీంలకు 10 శాతం రిజర్వేషన్లకు ప్రత్యేక బిల్లును పెడుతామని కాంగ్రెస్ ప్రభుత్వం, సిఎం రేవంత్ రెడ్డి ప్రకటించాలని సూచించారు.
కానీ బిసిలను మోసం చేయవద్దని కోరారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్లతో పాటు సపరేట్గా ముస్లీంలకు 10 శాతం రిజర్వేషన్లను తీసుకురావాలని, అప్పుడు బిజెపి ప్రభుత్వం బిల్లుపై సంతకం చేయకపోతే ఢిల్లీకి పోయి కూడా ధర్నా చేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలు కలిసి బిసిలను మోసం చేసే ప్రయత్నం చేస్తుందని ధ్వజమెత్తారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం సోమవారం ఇందిరాపార్కు వద్ద ధర్నాచౌక్లో ఎంఎల్సి కల్వకుంట్ల కవిత 72 గంటల నిరాహార దీక్ష ప్రారంభించారు. దీక్షకు వేలాది మంది ప్రజలు, ఆయా కుల సంఘాలు, ప్రజా సంఘాలు హాజరై మద్ధతు ప్రకటించారు. హర్యానకు చెందిన ఇండియన్ నేషనల్ లోక్ దళ్ నాయకుడు, మాజీ ఉప ప్రధాని దేవీలాల్ మునిమనువడు అర్జున్ సింగ్ చౌతాలా దీక్షకు హాజరై ఎంఎల్సి కవితకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎంఎల్సి కవిత మాట్లాడుతూ… ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని వర్గాలు బాగునప్పుడే తెలంగాణ బాగుటుందని అన్నారు. ప్రతీ ఒక్కరికి రాజ్యాధికారంలో వాటా రావాలి, అందరికీ ఆర్థిక అవకాశాలు, సమాజంలో గౌరవం దక్కాలని, సమాజంలో సగభాగం ఉన్న బిసిలకు రాజకీయంగా సమప్రధాన్యత దక్కాలని స్పష్టం చేశారు.
కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం యాథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి మెడలు వంచడంతో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి ప్రభుత్వం అసెంబ్లీలో రెండు బిల్లులను ఆమోదింపజేసిందని గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరాల్సిందేనని తేల్చిచెప్పారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను కేంద్రానికి పంపించి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దులుపుకుందామని చూస్తోందని, బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమేమో ఇది రాష్ట్రానికి సంబంధించి బిల్లు అని పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకెన్ని రోజులు స్థానిక సంస్థల ఎన్నికలు ఆపుతారని కొంత మంది నాయకులు అంటున్నారని, ఎన్ని రోజులైనా ఆపండి…ఎన్నికలకు తొందర ఏముందని ప్రశ్నించారు. రెండేళ్ల నుంచి సర్పంచ్లు, ఎంపిటిసిలు ఉన్నారా…? అని ప్రశ్నించారు. బిసిలకు రిజర్వేషన్లు సాధించాకే ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేశారు. గతంలో బిసిల హక్కుల సాధనలో భాగంగా తమిళనాడులో తొమ్మిదేళ్లు ఎన్నికలు పెట్టలేదని గుర్తు చేశారు.
హైకోర్టు ఆదేశాలతో దీక్ష విరమణ
బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ హైకోర్టుకు వెళ్తే, ప్రభుత్వం అనేక సాకులతో దీక్షకు అనుమతి ఇవ్వకుండా అడ్డుకుందని ఎంఎల్సి కవిత అన్నారు. సోమవారం సాయంత్రం ధర్నా చౌక్లో ఆమె మీడియాతో మాట్లాడారు. తాము 72 గంటల దీక్షకు అనుమతి కోరితే ప్రభుత్వం నాలుగు రోజుల పాటు దీక్షను వాయిదా వేయాలని హైకోర్టుకు సూచించిందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టు 72 గంటల నిరాహారదీక్షకు అనుమతి ఇవ్వలేదని తెలిపారు. తెలంగాణ జాగృతి క్రమశిక్షణ గల సంస్థ అని కోర్టు ఆదేశలను గౌరవిస్తూ 72 గంటల నిరాహారదీక్షను విరమిస్తున్నానని ప్రకటించారు. ఇది విరమణ కాదు విరామం మాత్రమేనని స్పష్టం చేశారు.
ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తిచూపుతూ బిసిల తరపున పోరాటం కొనసాగిస్తామన్నారు. సింహం ఒక అడుగు వెనక్కి వేస్తే వెనక్కి తగ్గినట్టు కాదని.. అలాగే తాము ఒక అడుగు వెనక్కి వేస్తే పది అడుగులు ముందుకు వేస్తామన్నది గుర్తు పెట్టుకోవాలన్నారు. బిసి రిజర్వేషన్ల కోసం పోరాటం ఆగదని, అనేక రూపాల్లో కొనసాగిస్తామన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ టైం పాస్ ధర్నాలు చేస్తున్నదని వాటితో సాధించేది ఏమీ లేదని విమర్శించారు. ప్రభుత్వంలో ఉన్నవాళ్లు రాష్ట్రపతి వద్దకు వెళ్లి ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. ఆర్డినెన్స్ను తొక్కి పెట్టిన గవర్నర్పై సుప్రీం కోర్టులో కేసు వేయాలన్నారు. ఢిల్లీలో టైమ్ పాస్ ధర్నాలు చేస్తే తెలంగాణ బిసి బిడ్డలు ఊరుకోరని హెచ్చరించారు. బీసీ సంఘాలు, నాయకులతో సమాలోచనలు చేసి మరో రూపంలో పోరాటం చేస్తామన్నారు. లోకల్ బాడీల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్తే ఎన్నికలు ఎట్లా ఆపాలో తమకు తెలుసు అన్నారు.
మేఘా కృష్ణా రెడ్డిని ఎందుకు విచారించలేదో చెప్పాలి
పిసి ఘోష్ కమిషన్ నివేదికలో కెసిఆర్ పేరును 36 సార్లు ప్రస్తావించినంత మాత్రాన ఆయన తప్పు చేసినట్టు కాదు అని ఎంఎల్సి కవిత పేర్కొన్నారు. అది కాంగ్రెస్ పార్టీ కమిషన్ అని తాము ధర్నా చౌక్ వేదికగానే ఎత్తిచూపామన్నారు. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కమిషన్ నివేదిక పేరుతో కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందన్నారు. నిపుణుల కమిటీ సూచనల మేరకు నిర్మాణాలు జరిగాయన్నారు. ప్రాజెక్టులో అత్యధిక టెండర్లు దక్కించుకున్న మేఘా కృష్ణా రెడ్డిని ఎందుకు విచారించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.