మాస్కో: సాశ్చాత్య దేశాల ఆంక్షలను ఎదుర్కొంటున్న రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేయాలంటూ భారత్పై అమెరికా ఒత్తిడి తెస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తే సుంకాలు పెంచుతామని ట్రంప్ హెచ్చరించడంపై రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ తీవ్రస్థాయిలో మండిపడింది. భారత్పై అమెరికా అక్రమ వాణిజ్య ఒత్తిడిని తీసుకువస్తోందని విమర్శించింది. సార్వభౌమ దేశాలకు తమ వాణిజ్య భాగస్వాములను సొంతంగా ఎంచుకునే హక్కు ఉంటుందని అగ్రరాజ్యం అమెరికాకు స్పష్టం చేసింది.
భారత్పై అమెరికా చేస్తున్న బెదిరింపులు అసమర్థమైనవని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. ‘ఉక్రెయిన్తో యుద్ధం ముగింపుపై నిర్ణయం తీసుకోకపోవడంతో మాతో వాణిజ్య సంబంధాలను రద్ద్దు చేసుకోవాలని అగ్రరాజ్యం ఇతర దేశాలను బెదిరించడం మేం గమనిస్తూనే ఉన్నాం. అటువంటి బెదిరింపులను చట్టబద్ధమైనవిగా పరిగణించం. ఎందుకంటే సార్వభౌమ దేశాలకు తమ వాణిజ్య భాగస్వాములను ఎంచుకునే హక్కును కలిగి ఉంటాయని మేము విశ్వసిస్తున్నాం. అందుకు విరుద్ధంగా అమెరికా ఇలాంటి బెదిరింపులకు పాల్పడడం సరైన చర్య కాదు’ అని పెస్కోవ్ అన్నారు.