హైదరాబాద్: ఎస్ఎల్బిసి సొరంగంలో జరిగిన ప్రమాదం తర్వాత అక్కడ పనులు ఆగిపోయాయి. అయితే ఆ పనులను పునః ప్రారంభించాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి (Uttamkumar Reddy) అధికారులను ఆదేశించారు. అందుకోసం అవసరమైన అనుమతులపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భేటీ నిర్వహిస్తారని అన్నారు. శుక్రవారం నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో మంత్రి సమీక్ష నిర్వహించారు. సొరంగంలో ప్రమాదం తర్వాత నిపుణుల కమిటీ సిఫార్సులతో పనులు తిరిగి మొదలు పెట్టాలని ఉత్తమ్ అన్నారు.
‘‘ముఖ్యమైన ప్రాజెక్టు 9 కి.మి పనికే ఆగిపోవడం దురదృష్టకరం. ఎస్ఎల్బిసి పూర్తి కాకపోవడంతో ఎత్తిపోతలకు రూ.750 కోట్లు ఖర్చవుతోంది. అందుకే అత్యాధునిక సాంకేతికతతో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్జిఆర్ఐ సర్వేతో భూగర్భం కి.మి దిగువ వరకూ మ్యాపింగ్ చేయొచ్చు. కచ్చితమైన ప్రణాళిక కోసం లైడార్ సర్వే కూడా చేస్తాం. నాణ్యతలో రాజీపడకుండా మంత్రివర్గం ఆమోదించిన అంచనాతో ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలి’’ అని ఉత్తమ్ (Uttamkumar Reddy) అధికారులకు తెలిపారు.
మూడు దశాబ్ధాల తర్వాత నీటిపారుదల శాఖలో పదోన్నతులు, బదిలీలు జరుగుతున్నట్లు చెప్పారు. మరోవైపు ఎస్ఎల్బిసి సొరంగానికి హెలికాఫ్టర్తో మాగ్నెటిక్ జియోఫిజికల్ సర్వేకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. రూ.2.36 కోట్లతో నామినేషన్ పద్దతిన ఎన్జిఆర్ఐకి పనులు అప్పగించింది.