కొండకోనల్లో గలగలాపారే సెలయేళ్ళ మధ్య, పచ్చని ప్రకృతివడిలో జీవించే ఆదివాసీల హక్కులు, సంస్కృతులు, భాషలు, జీవనశైలుల గురించి చైతన్యం కల్పించాలనే లక్ష్యంతో ఆగస్టు 9వ తేదీన ప్రపంచ ఆదివాసీ దినాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచ ఆదివాసీ దినం ముఖ్యఉద్దేశాన్ని మరచి మూడు దశాబ్దాలకు పైగా అయింది. పాలకులు దీన్ని ఒక జాతరలాగా లేదా ఒక పండుగగా దీన్ని మార్చేశారు. అభివృద్ధి పేరుతో జరుగుతోన్న విధ్వంసం వారి జీవితాల పాలిట శాపంగా మారింది. నేటికీ విద్య, ఉద్యోగ, ఉపాధి, వైద్యావకాశాలు గానీ, కనీస మౌలిక సదుపాయాలు గానీ వారికి అందుబాటులోకి రాలేదు. తమదైన ప్రత్యేక ఆచార వ్యవహారాలను, హక్కులను కోల్పోతున్నారు. తాము పోరాడి సాధించుకున్న హక్కులు క్రమంగా ఒక్కొక్కటిగా కనుమరుగవుతున్నాయి. అటవీ వనరులపై ఆదివాసీల హక్కుల పరిరక్షణకు సంబంధించిన సమస్యలపై 1982 ఆగస్టు 9వ తేదీన జెనీవాలో 26 మందితో ఒక సమావేశాన్ని నిర్వహించారు.
140 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలోనే అంతర్జాతీయ ఆదివాసీ దినం తేదీని ఖరారు చేశారు. ఐక్యరాజ్యసమితి అంచనా (United Nations assessment) ప్రకారం నేటికి ఐదువేల ఆదివాసీ తెగలు, 6700 భాషలు మనుగడలో ఉన్నాయి. మన దేశంలో 467 ఆదివాసీ తెగలు ఉండగా, వాటిలో 92% ఈనాటికీ అడవిపైనే ఆధారపడి, అర్ధాకలితో జీవిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 37 కోట్ల మంది ఆదివాసీలు వివిధ రకాల వివక్షలు ఎదుర్కొంటున్నారు. ఆదివాసీల హక్కులు, సంస్కృతుల రక్షణ కోసం ఐక్యరాజ్య సమితి ఆమోదించిన తీర్మానాలు, విధానాలు, అభివృద్ధి ఆశయాలు ఆచరణలో తుంగలో తొక్కేస్థితి. ఆదివాసీల అభివృద్ధిపై ఐక్యరాజ్యసమితిలో సంతకం చేసిన భారతదేశంలో ఆదివాసీలపై అనుసరిస్తున్న అత్యంత అమానుష విధ్వంసకాండ ఫలితంగా నిలువనీడ కూడా లేని పరిస్థితి నెలకొన్నది.
ప్రభుత్వం చేపడుతోన్న ఆదివాసీ వ్యతిరేక చర్యలు వారిని నిత్యనిర్వాసితులుగా తయారు చేసింది. ద్రౌపది ముర్ముకి రాష్ట్రపతి పదవి ఇచ్చినంత మాత్రానే మోడీ ప్రభుత్వం ఆదివాసీలకు ఎంతో చేసినట్లు ప్రచారం చేస్తోంది. కానీ కనీసం రాష్ట్రపతి స్వగ్రామంలో సైతం కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడాన్ని కప్పిపెడుతోంది కేంద్రంలోని ప్రభుత్వం. 805 ఆదివాసీ గ్రామాలను 5వ షెడ్యూల్లో చేర్చాలని 1980లో వేసిన భూరియా కమిషన్ చేసిన సిఫార్సులను సైతం బుట్టదాఖలు చేశారు. ఐదవ షెడ్యూల్లో ఈ ఆదివాసీ గ్రామాలు లేకపోవడం వల్ల 1 ఆప్ 70 లాంటి చట్టాలు అమలు కావడం లేదు. ఆదివాసీ హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం, తమ సంస్కృతీ సాంప్రదాయాల పరిరక్షణ కోసం శ్రీకాకుళ సాయుధ రైతాంగ పోరాటం ఫలితంగా ఆదివాసీలు అనేక హక్కులు సాధించుకోగలిగారు. ఆ ఉద్యమాల ఫలితంగా 1 ఆఫ్ 70 చట్టం, పెసా చట్టం, 2006 అటవీ హక్కుల చట్టాలు ఆదివాసీలు సాధించుకోగలిగారు. కానీ ఆచరణలో అవి అమలు చేయడంలేదు.
ఇక అడవులనూ, వనరులనూ, ఖనిజాలనూ కార్పొరేట్లకు ధారాదత్తం చేసే ప్రయత్నంలో మోడీ ప్రభుత్వం చేస్తోంది. అదానీకి, అంబానీకి, మిట్టల్కు అటవీ సంపద కట్టబెడుతోంది మోడీ ప్రభుత్వం. అంతకంటే ఘోరంగా 2019లో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం చట్టప్రకారం ఆదివాసీలుగా నిర్ధారించబడని వారంతా నేరస్థులు. కనుక వారిని అడవుల నుంచి గెంటివేయాలన్న తీర్పు ఆదివాసీల నెత్తిన కత్తిలా వేలాడుతూనే ఉంది. అటవీ, అటవీయేతర భూములను, ఉమ్మడి భూములను ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేయడానికి పెసా, అటవీ హక్కుల గుర్తింపు చట్టాలు ఆటంకంగా వున్నందున వీటిని నిర్దాక్షిణ్యంగా రద్దు చేయడానికి అటవీ సంరక్షన నియమాల పేరుతో 2023 లో తీసుకొచ్చిన చట్టంతో ఆదివాసీలు ఇప్పటి వరకు పోరాడి సాధించుకున్న అన్ని హక్కులూ అణచివేతకు గురవుతాయి.
మరోవైపు ఆపరేషన్ కగార్ పేరుతో, మావోయిస్టు రహిత భారత్ను సృష్టిస్తామంటూ మోడీ ప్రభుత్వం ఆదివాసీలపై యుద్ధం ప్రకటించింది. గత మార్చిలో చత్తీస్ గఢ్ రాష్ట్రంలో 7000 ఎకరాల్లోని చెట్ల నరికివేతకు నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలో గత మే నెలలో 2324 ఎకరాల్లో 1,23,000 చెట్లు నరికివేతకు నిర్ణయం తీసుకుంది. మరోవైపు గత ఫిబ్రవరి, మార్చి నెలల్లో బైలదిల్లా 1, బైలదిల్లా 2, బైలదిల్లా 3 గనులను ప్రైవేటుపరం చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన దంతెవాడ, కాంకేరు జిల్లాల్లో 7000 ఎకరాల గనులు 50 సంవత్సరాలకు లీజుకిచ్చారు. బాక్సైట్ ఖనిజాల కోసం తూర్పు కనుమలు జల్లెడ పడుతున్నారు. చత్తీస్గఢ్ ప్రభుత్వం టెండర్లు పిలిస్తే 58 జాతీయ, అంతర్జాతీయ బహుళజాతి సంస్థలు దానికి హాజరయ్యారంటే ఆదివాసీ ప్రాంతాల్లో జరుగుతున్నదేమిటో అర్థం చేసుకోవచ్చు.
మరోవైపు ఎపిఒ అభివృద్ధి పేరుతో ప్రభుత్వం చేస్తోన్న చర్యలు ఆదివాసీల జీవితాల్లో కల్లోలం సృష్టిస్తున్నాయి. అటవీ భూములలో టైగర్ జోన్లు, ఎలిఫెంట్ జోన్లు, ఎకో టూరిజం సౌకర్యాలు వంటి కొన్ని అటవీయేతర కార్యకలాపాలను ప్రభుత్వం అనుమతిస్తోంది. వీటికి ప్రపంచ బ్యాంకు నిధులను సమకూరుస్తోంది. అభివృద్ధి ప్రాజెక్టుల కారణంగా భారత దేశంలో గత 50 ఏళ్ళలో దాదాపు 5 కోట్ల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఆదివాసీ ప్రాంతాల్లోని దీర్ఘకాలిక పోషకాహార లోపం, రక్తహీనత వారిని అనారోగ్య కుహరంలోకి నెడుతోంది. రక్షిత మంచినీరు, వైద్యం వారికి అందని ద్రాక్షగానే మిగిలింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆదివాసీలు తమ హక్కుల కోసం, ప్రత్యేక సంస్కృతీ సాంప్రదాయాల రక్షణకోసం, అడవులు, పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సమాజ మార్పుకోసం జరిగే ఉద్యమాల్లో ఆదివాసీల హక్కుల సాధన కూడా ఒక భాగం. ఆ ఉద్యమాల ద్వారానే ఆదివాసీల హక్కుల సాధన సాధ్యమవుతుంది.
- వంకల మాధవరావు, 81793 84630
- నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం