మనతెలంగాణ/హైదరాబాద్: రాఖీ పౌర్ణమి సందర్భంగా బిఆర్ఎస్ అధినేత, మాజీ సిఎం కెసిఆర్కు ఆయన సోదరీమణులు రాఖీ కట్టారు. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో అక్కాచెల్లెళ్లు కలిసి కెసిఆర్కు హారతి పట్టి, రాఖీలు కట్టి, మిఠాయిలు తినిపించి ఆశీర్వదించారు. ఈ వేడుకలలో కెసిఆర్ సతీమణి శోభమ్మ, కెసిఆర్ అక్కలు లక్ష్మీబాయి, జయమ్మ, చెల్లెలు వినోదమ్మ పాల్గొన్నారు.
ఈసారి రాఖీకి వేడుకలకు దూరంగా కెటిఆర్, కవిత
ప్రతీ రాఖీ పౌర్ణమికి తమ అనుబంధాన్ని చాటే అన్నా చెల్లెళ్లు కెటిఆర్, కవిత ఈసారి మాత్రం దూరంగా ఉన్నారు. ప్రతి ఏటా అన్న కెటిఆర్కు క్రమం తప్పకుండా రాఖీ కట్టే కవిత ఈ సారి కట్టలేకపోయారు. ఇటీవల ఓ టివి ఇంటర్వూలో ఈసారి మీ అన్న కెటిఆర్కు రాఖీ కడతారా..? అని కవితను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ, రక్త సంబంధం వేరు..రాకీయాలు వేరు…కచ్చితంగా మా అన్నకు రాఖీ కడతాను అని కవిత చెప్పారు. కాగా, శనివారం రాఖీ పౌర్ణమి సందర్భంగా.. అన్నకు రాఖీ కట్టేందుకు వస్తానంటే తాను హైదరాబాద్లో లేనని, కలవలేనని చెప్పినట్లుగా కవిత సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. రాఖీ వేడుకల గురించి కొందరు విలేకరులు కవితను సంప్రదించగా, అన్న కెటిఆర్ బెంగళూరులో ఉన్నట్లు చెప్పారని, ప్రస్తుతం తాను హైదరాబాద్లో అందుబాటులో లేనని మెసేజ్ పెట్టారని తెలిపారు. అందుకే రాఖీ వేళ అన్నకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. కెటిఆర్ బెంగళూరులో ఉండటమే ఇందుకు కారణమా.. లేక కొన్నాళ్లుగా పార్టీ పరంగా నెలకొన్న విబేధాలు కారణంగా నిలిచాయా? అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.