సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేస్తూ ప్రాచుర్యం కల్పించిందే బిఆర్ఎస్ అని కాంగ్రెస్ ఎంపి చామల కిరణ్కుమార్ రెడ్డి అన్నారు. తాను ఏదీ మాట్లాడినా దాంట్లో నుంచి కొంత తీసేసి మరి కొంత ప్రచారం చేస్తున్న బిఆర్ఎస్ నాయకులకు ధన్యవాదాలు అని చామల కిరణ్కుమార్ రెడ్డి శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లడుతూ చెప్పారు. తనను ట్రోల్ చేస్తే భయపడి మాట్లాడడం ఆపేస్తానని వారు భావిస్తున్నారేమోనని ఆయన తెలిపారు. తాను ఒక్కసారి మీడియా సమావేశాన్ని నిర్వహిస్తే, బిఆర్ఎస్ నేతలు దానిని మూడు, నాలుగు రోజులు తిప్పుతూ ట్రోల్ చేస్తుంటారని ఆయన చెప్పారు. ఇది ఒక రకంగా తనకు మేలు కలుగుతున్నదన్నారు.
నీటి పారుదల విషయంలో బిఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. బనకచర్లపై కొన్ని రోజులు డ్రామా చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేస్తున్నదంటూ బిఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి. హరీష్ రావు ఏకపాత్రాభినయం చేశారని ఆయన విమర్శించారు. పోతిరెడ్డి పాడుకు గండి కొట్టడానికి సహకరించింది బిఆర్ఎస్సేనని ఆయన విమర్శించారు. కృష్ణా నీటిని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరలించుకుపోతుంటే పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న బిఆర్ఎస్ నేత కె. చంద్రశేఖర్ రావు ఎందుకు మౌనంగా ఉన్నారని ఎంపి చామల ప్రశ్నించారు. బనకచర్ల, ఆల్మట్టి విషయంలో తమ ప్రభుత్వం అలసత్వంగా లేదని ఆయన తెలిపారు.