న్యూఢిల్లీ : పాకిస్థాన్-సౌదీ అరేబియా మధ్య ఇటీవలే రక్షణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందంపై పాక్ రక్షణ మంత్రి ఖవాజ్ ఆసిఫ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్తో ఉద్రిక్తతల సమయంలో సౌదీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో ఆసిఫ్ మాట్లాడారు. పాక్భారత్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు సౌదీ దళాలు మీకు తోడుగా నిలబడతాయా అన్న ప్రశ్నకు కచ్చితంగా అందులో ఎలాంటి సందేహం లేదని బదులిచ్చారు. పాక్, సౌదీ ఏ దేశాన్ని దురాక్రమణదారుగా పేర్కొనలేదు.
ఈ ఒప్పందం కేవలం ఇరువైపులా ఒక రక్షణ గోడలాంటిది. ఇరుదేశాల్లో దేని మీదైనా మరో దేశం దురాక్రమణకు పాల్పడితే సంయుక్తంగా కలిసి పరిష్కరించుకుంటాం. ఈ ఒప్పందం దురుద్దేశంతో చేసుకున్నది కాదు. కానీ ఎవరైనా తమను బెదిరించాలని చూసినప్పుడు కూడా ఇది అమల్లోకి వస్తుంది అని ఆసిఫ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాక్ అణ్వాయుధాలను సౌదీ కూడా ఉపయోగించుకోవచ్చని తెలిపారు. ఈ ఒప్పందంపై భారత విదేశాంగ శాఖ కూడా స్పందించింది. జాతీయ భద్రతతో పాటు ప్రాంతీయ, ప్రపంచ స్థిరత్వంపై ఈ ఒప్పందం పరిణామాలు ఎలా ఉంటాయనే దానిపై అధ్యయనం చేస్తున్నామని తెలిపింది. జాతీయ ప్రయోజనాలను పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్నట్టు వెల్లడించింది. కొన్ని నెలల క్రితం పాక్, భారత్ మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాక్, సౌదీల మధ్య రక్షణ ఒప్పందం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.