మనతెలంగాణ/హైదరాబాద్: ఫిరాయింపులు ప్రోత్సహించిందే కాంగ్రెస్ పార్టీ అని, బిఆర్ఎస్ పార్టీ పుట్టకముందే ఫిరాయింపుల చట్టం వచ్చిందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్ఎ జగదీష్రెడ్డి వ్యాఖ్యానించారు. ఫిరాయింపులకు కారణం కాంగ్రెస్, బిజెపి పార్టీలే అని ఆరోపించారు. బిఆర్ఎస్ ఎంఎల్ఎలు పాడి కౌశిక్ రెడ్డి, కె.సంజయ్లతో కలిసి సోమవారం అసెంబ్లీ సెక్రటరీని కలిసి అఫిడవిట్ సమర్పించారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బిఆర్ఎస్ ఎంఎల్ఎలతో కలిసి జగదీష్రెడ్డి మీడియాతో మాట్లాడారు. బిఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎంఎల్ఎలు నియోజక వర్గ ప్రజలను ద్రోహంచేసి పార్టీ మారారని మండిపడ్డారు. అన్ని ఆధారాలు సెక్రటరీకి సమర్పించామని తెఇలపారు. స్పీకర్ సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాను ఏ పార్టీలో ఉన్నానో స్పీకర్ నిర్ణయిస్తారని కడియం శ్రీహరి మాట్లాడుతున్నారని, సోయి, జ్ఞానంతో మాట్లాడాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ నిర్ణయం ఏదైనా… ప్రజల దృష్టిలో ఆయనేంటో అర్థం అయిందని విమర్శించారు. ఉప ఎన్నికలు రావటం ఖాయం అని, పార్టీ మారిన ఎంఎల్ఎలు మట్టి కరవటం ఖాయం అని పేర్కొన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అసలు బ్రెయినే లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కృష్ణానదిలో జలాల్లో వాటాలపై చర్చకు తాము సిద్ధమని ప్రకటించారు. కాంగ్రెస్ దుర్మార్గం వల్లనే కృష్ణా జలాల్లో 299 వాటా వచ్చిందని, చర్చించటానికి డేట్ ఫిక్స్ చేస్తే ఆధారాలతో వస్తామని చెప్పారు.