- దసరా పండుగ పూట కార్మికులకు చేదు కబురు చెప్పారు
- సింగరేణి బోనస్పై రేవంత్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్రావు ధ్వజం
- మొత్తం లాభంపై కాకుండా వాటా తగ్గించి బోనస్ ఇస్తున్నారని ఆరోపణ
- నికర లాభాల్లో 34 శాతంను బోనస్గా ప్రకటించాలని డిమాండ్
మనతెలంగాణ/హైదరాబాద్ : సింగరేణి కార్మికులకు చెల్లించే బోనస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ నేత హరీష్రావు ఎక్స్ వేదికగా తీవ్రంగా విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతాయని, కానీ చేతలు గడప కూడా దాటవనే విషయం మరోసారి రుజువైందని ఎద్దేవా చేశారు. దసరా పండుగ వేళ కార్మికులకు తీపి కబురు చెప్పాల్సింది పోయి, చేదు వార్తతో వారిని తీవ్ర నిరాశకు గురిచేశారని మండిపడ్డారు. సంస్థకు వచ్చిన మొత్తం లాభం రూ.6,394 కోట్లను కాకుండా, కేవలం రూ. 2,360 కోట్ల నుంచి మాత్రమే బోనస్ లెక్కించడం దారుణమని అన్నారు. పంచాల్సిన వాటాను తగ్గించి, శాతాలు పెంచి చూపడం ద్వారా కార్మికులను ప్రభుత్వం వంచిస్తోందని విమర్శించారు. గతేడాది కూడా ఇదే పద్ధతిలో 50 శాతం వాటాకు కోత విధించారని గుర్తుచేశారు. కష్టపడి పనిచేసి సంస్థకు లాభాలు తెచ్చిపెట్టిన కార్మికుల ఆశలను కాంగ్రెస్ ప్రభుత్వం అడియాశలు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్య రాష్ట్రంలో 1998 -99 నుంచి 2010 -11 వరకు సింగరేణి లాభాల్లో కార్మికులకు ఇచ్చిన వాటా కేవలం 16 శాతమే అని పేర్కొన్నారు. స్వరాష్ట్ర సాధన కోసం ఉద్యమం వెంట నడిచిన సింగరేణి కార్మికుల కష్టాలను దృష్టిలో పెట్టుకుని సిఎం కెసిఆర్ ఎంతో ఉదారతతో వ్యవహరించారని తెలిపారు.
రాష్ట్రం ఏర్పడిన తొలి సంవత్సరం (2014- 15)లోనే సింగరేణి లాభాల నుంచి కార్మికులకు 21 శాతం వాటాను ప్రకటించారని గుర్తు చేశారు. 2022 -23లో కార్మికులకు సంస్థ లాభాల్లో ఏకంగా 32 శాతం వాటాను ప్రకటించి కార్మికుల కష్టానికి గుర్తింపు, గౌరవం ఇచ్చారని చెప్పారు. లాభాల వాటాను 16 శాతం ఉన్నదానిని 32 శాతం వరకు పెంచిన ఘనత తెలంగాణ కెసిఆర్కే దక్కుతుందని వ్యాఖ్యానించారు. గతంలో కెసిఆర్ సర్కార్ ఎప్పుడూ నికర లాభం నుంచే కార్మికులకు వాటా ఇచ్చారని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం లాభంలో మూడో వంతు పక్కనపెట్టి మిగిలిన దానిలో వాటా ఇవ్వడం దుర్మార్గమని మండిపడ్డారు.
గతేడాది భవిష్యత్ ప్రణాళికల కోసం కేటాయించిన రూ. 2,283 కోట్లు ఏమయ్యాయో తెలియదని, ఇప్పుడు మరో రూ. 4,034 కోట్ల సింగరేణి సొమ్ముకు ఎసరు పెట్టారని ఆరోపించారు. కార్మికుల హక్కుగా రావాల్సిన వాటాను ఎవరి జేబుల్లోకి మళ్లిస్తున్నారని హరీష్రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వెంటనే ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించినట్లుగానే మొత్తం నికర లాభంపై 34 శాతం బోనస్గా ప్రకటించాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో, రాష్ట్ర ప్రగతిలో కీలక పాత్ర పోషించిన సింగరేణి కార్మికులకు అన్యాయం జరిగితే బిఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని, వారి తరఫున పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని హరీష్రావు హెచ్చరించారు.
Also Read: బండి సంజయ్ కి జగదీష్ రెడ్డి కౌంటర్