Tuesday, September 23, 2025

నేడు మేడారానికి సిఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

జాతర నిర్వహణ, ఏర్పాట్లపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో సిఎం సమీక్ష
గిరిజన సంప్రదాయాలు, విశ్వాసాలకు భంగం వాటిల్లకుండా ఏర్పాట్లు
చేయాలని అధికారులకు దిశానిర్ధేశం
మనతెలంగాణ/హైదరాబాద్: ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మేడారం జాతరను మరింత ఘనంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం నడుంబిగించింది. అందులో భాగంగానే మంగళవారం మేడారం క్షేత్ర స్థాయి సందర్శనకు సిఎం వెళుతున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి క్షేత్ర స్థాయికి వెళ్లి జాతరకు ముందే ఏర్పాట్ల ప్రణాళిక, ప్రతిపాదనలను పరిశీలించటం ఇదే తొలిసారి. మేడారం పూజరులు, ఆదివాసీ పెద్దలు, మంత్రులు, గిరిజన ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రముఖులతో జాతర నిర్వహణ, కొత్త నిర్మాణాలపై ముఖ్యమంత్రి మంగళవారం మేడారంలో సమీక్ష నిర్వహించనున్నారు. ఇంతకాలం మేడారం జాతరకు ప్రభుత్వాలు తాత్కాలిక ఏర్పాట్లు చేసేవి. జాతర నిర్వహణపై సమీక్షకు సైతం గతంలో ముఖ్యమంత్రులు పెద్దగా శ్రద్ధ చూపేవారు కాదు. తొలిసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం జాతర ఏర్పాట్లపై ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తుండడం విశేషం.

భారీ ఎత్తున స్వాగత తోరణాల నిర్మాణం
ఆదివాసీ సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ ఇలవేల్పులు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలున్న ప్రాంగణాన్ని లక్షలాది భక్తులు దర్శించుకునేందుకు వీలుగా మేడారంలో భారీ ఎత్తున అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. కోట్లాది భక్తులు వచ్చే జాతర ప్రాశస్త్యానికి తగ్గట్లు భారీ ఎత్తున స్వాగత తోరణాల నిర్మాణంతో పాటు గద్దెల వద్దకు భక్తులు సులువుగా చేరుకోవడం, గద్దెల దర్శనం, బంగారం (బెల్లం) సమర్పణ, జంపన్న వాగులో స్నానాలచరించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నారు.

ప్రతి నిర్మాణం, ప్రతి కట్టడం ఆదివాసీ సంప్రదాయాలకు అనుగుణంగా
మేడారం అభివృద్ధి పనుల్లో గిరిజన సంప్రదాయాలు, విశ్వాసాలకు ఎటువంటి భంగం కలగవద్దన్న కృతనిశ్చయంతో ఉన్న ప్రజా ప్రభుత్వం ప్రతి నిర్మాణం, ప్రతి కట్టడాన్ని పూర్తిగా ఆదివాసీ సంప్రదాయాలకు అనుగుణంగా, మేడారం జాతర పూజారులు, ఆదివాసీ పెద్దల సూచనలతో ప్రభుత్వం చేపట్టనుంది. నిర్మాణాల్లో విలువైన గ్రానైట్, లైమ్‌టెన్ రాళ్లను వాడనున్నారు. పురాతన ఆలయాల పునఃనిర్మాణం, ప్రసిద్ధ ఆలయాల్లో అభివృద్ధి పనుల్లో ప్రసిద్ధుడైన స్తపతి ఈమని శివనాగిరెడ్డి సేవలను మేడారం అభివృద్ధి పనులకు ప్రభుత్వం వినియోగించుకుంటోంది.

ఏడాది పొడవునా అన్ని రోజుల్లో మేడారం వచ్చి గద్దెలను దర్శించుకునేలా….
గతంలో ముఖ్యమంత్రులు, మంత్రులు జాతరకు వెళ్లడం దర్శనాలతో సరిపుచ్చేవారు. మేడారం అభివృద్ధిపై ఏమాత్రం శ్రద్ద వహించలేదు. ఈసారి అందుకు భిన్నంగా ప్రపంచ పటంలో జాతరకు మరింత వన్నె తేవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సంకల్పించారు. ఆదివాసీల సంప్రదాయాలు, ఆకాంక్షలకు అద్దంపట్టేలా మేడారం జాతరను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు తయారు చేయాలని ఇటీవలే సిఎం అధికారులను ఆదేశించారు. రెండేళ్లకోసారి జరిగే మహా జాతరతో పాటు ఏడాది పొడవునా అన్ని రోజుల్లో మేడారం వచ్చి గద్దెలను దర్శించుకునే భక్తుల సంఖ్య పెరిగింది. వీకెండ్, సెలవు దినాల్లో ఈ రద్దీ మరింత పెరుగుతోంది. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా అవసరమైన వసతి, సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది. మేడారం అభివృద్ధి పనులతో ఆదివాసీ సంస్కృతీ, సంప్రదాయాలకు పెద్ద పీట వేయటంతో పాటు ఆధ్యా త్మిక పర్యాటకానికి ప్రభుత్వం ఊతమివ్వనుంది. ఫలితంగా మేడారం సమీపంలో ఉన్న రామప్ప, ఇతర ఆలయాలకు భక్తుల సంఖ్య పెరిగి స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి.

Also Read: బతుకమ్మ వేడుకలపై పోలీసుల ఆంక్షలా?: రాంచందర్ రావు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News