విద్య, వైద్యం, రోడ్డు రవాణా, పారిశుద్ధానికి అత్యధిక ప్రాధాన్యం
వీధి వ్యాపారుల కోసం ప్రత్యేక వెండింగ్ జోన్లు
వీధి దీపాలకు సోలార్ విద్యుత్ వినియోగం
కబ్జా చెర వీడిన భూముల్లో ఆధునాతన స్కూల్ భవనాల నిర్మాణం
ప్రభుత్వ ఆఫీసులన్నీ సొంత భవనాల్లోనే ఉండాలి
సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రైజింగ్ కోర్ అర్భన్ సిటీ ఏరియాను ప్రజల మౌలిక వసతులకు నిలువుటద్దం పట్టేలా గ్లోబల్ సిటీకి చిరునామాగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. మానవ జీవన ప్రమాణాలకు కొలమానమైన విద్య, వైద్యం, రోడ్డు రవాణా, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని సిఎం అన్ని విభాగాల ఉన్నతాధికారులకు దిశానిర్ధేశం చేశారు. సిటీ విస్తరణలో భాగంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి గ్రేటర్ సిటీకి లక్షలాది కుటుంబాలు వలస వస్తున్నాయని సిఎం అన్నారు. సిటీ పరిధితో పాటు పెరుగుతున్న జనాభాకు అవసరమైన మౌలిక సదుపాయాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా అధునాతనంగా అందించే లక్ష్యంతో ప్రణాళిక రూపొందించాలని సిఎం రేవంత్రెడ్డి సూచించారు. సోమవారం సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో తెలంగాణ రైజింగ్ కోర్ అర్బన్ ఏరియా అభివృద్ధిపై ప్రతిపాదనలపై చర్చించారు. సిఎంతో పాటు సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డిజిపి జితేందర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీలు శేషాద్రి, శ్రీనివాసరాజు, స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, సిఎం సెక్రటరీ మాణిఖ్యరాజ్, జిహెచ్ఎంసీ, హైడ్రా, హెచ్ఎండిఏ కమిషనర్లు, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు, వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అయిదు ప్రధాన అంశాలు…111 ప్రతిపాదనలు..
ఈ సమావేశంలో కోర్ అర్బన్ సిటీ అభివృద్ధి ప్రణాళికను అయిదు ప్రధాన అంశాలుగా విభజించి, మొత్తం 111 ప్రతిపాదనలను స్పెషల్ సిఎస్ జయేష్ రంజన్ పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇచ్చారు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దే ప్రతిపాదనలను మరింత లోతుగా పరిశీలించాలని, ప్రజల అవసరాలు తీర్చే మౌలిక వసతులను ప్రపంచ స్థాయి అధునాతన ప్రమాణాలతో అందించేందుకు పెద్దపీట వేయాలని సిఎం అన్నారు. పైపై మెరుగులు కాకుండా పేద, మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా తెలంగాణ కోర్ అర్బన్ సిటీని అభివృద్ధి చేయాలని సిఎం రేవంత్ చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. కోర్ అర్బన్ సిటీ అభివృద్ధిలో భాగంగా ప్రాథమిక విద్యను అందరికీ అందించే సంస్కరణలు ముందుగా అమలు చేయాలన్నారు. జీహెచ్ఎంసీ, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఉన్న ప్రభుత్వ ్రప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు, కాలేజీలను గుర్తించాలన్నారు. నర్సరీ నుంచి 4వ తరగతి వరకు, 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు, 9వ తరగతి నుంచి ఇంటర్ సెకండియర్ వరకు మూడు కేటగిరీలుగా నాణ్యమైన విద్య అందరికీ అందించాలన్నారు. నర్సరీ నుంచి 4వ తరగతి స్కూళ్లపై ముందుగా ఫోకస్ చేయాలని, ప్రభుత్వ స్థలాలు, ఇటీవల కబ్జాలు, ఆక్రమణల నుంచి విముక్తి పొందిన ప్రభుత్వ భూముల్లో స్కూళ్లకు అధునాతన భవనాలు నిర్మించాలన్నారు.
నాలుగైదు స్కూళ్లను ఒకే సముదాయంలోకి తీసుకువస్తే
ఇప్పుడు అరకొర వసతులతో ఉన్న నాలుగైదు స్కూళ్లను ఒకే సముదాయంలోకి తీసుకువస్తే మంచి ఫలితాలుంటాయని సిఎం రేవంత్రెడ్డి అన్నారు. దీనివల్ల టీచర్ల కొరత తీరిపోతుందన్నారు. పిల్లలకు బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్లను కూడా స్కూల్లోనే అందించి, ప్రభుత్వం తరఫున ట్రాన్స్పోర్ట్ అందించాలన్నారు. దీంతో పేద, మధ్యతరగతి తల్లిదండ్రులపై ఫీజుల భారం తగ్గుతుందని, ప్రభుత్వం అందించే నాణ్యమైన విద్య పిల్లల భవితకు దోహదపడుతుందన్నారు. వెంటనే ఈ ప్రణాళికను సిద్ధం చేసి అమలు చేయాలని విద్యాశాఖను సిఎం ఆదేశించారు. ఇదే విధంగా పేదలకు తక్షణ వైద్య సాయం అందుబాటులో ఉండేలా ప్రత్యేక క్లీనిక్లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని సిఎం అధికారులను హెచ్చరించారు. ప్రపంచంలో హైదరాబాద్కు క్లీన్ సిటీ ఇమేజీ తీసుకువచ్చేందుకు నిరంతరం శ్రమించాలన్నారు. చెత్త సేకరణలో నిర్ల్యక్ష్యంగా వ్యవహారిస్తే చర్యలు తప్పవని మున్సిపల్, జీహెచ్ఎంసీ అధికారులను సిఎం రేవంత్రెడ్డి హెచ్చరించారు. చెత్త సేకరణతో పాటు క్లీన్సిటీగా రూపొందించే ప్రణాళికలను అమలు చేసే అధికారులకు ప్రభుత్వం తరఫున ప్రోత్సాహాకం ఉంటుందని సిఎం ప్రకటించారు. కోర్ అర్బన్ సిటీలో ఒక్క ప్రభుత్వ ఆఫీసు కూడా అద్దె భవనాల్లో ఉండేందుకు వీల్లేదని, ప్రతి ఆఫీస్కు సొంత భవనం ఉండాలని సిఎం అన్నారు. వాటికి అవసరమైన స్థలాలు కేటాయించాలని, ప్రాధాన్య క్రమంలో భవనాలు నిర్మించే ప్రణాళిక తయారు చేయాలన్నారు.
ఆఫీసులపై సోలార్ విద్యుత్ ప్లాంట్లను అమర్చాలి
సచివాలయంతో పాటు సిటీలో ఉన్న ప్రభుత్వ ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలన్నీ పునరాత్పదక విద్యుత్ను మాత్రమే వినియోగించాలని సిఎం ఆదేశించారు. వెంటనే ఆఫీసులపై సోలార్ విద్యుత్ ప్లాంట్లను అమర్చాలని సిఎం రేవంత్ ఆదేశించారు. కోర్ అర్భన్ సిటీలో నాలాలు, కుంటలు, చెరువుల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని సిఎం ఆదేశించారు. నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను కాపాడేందుకు డిజిటల్ ల్యాండ్ డేటాబేస్ విధానం అమలు చేయాలన్నారు. సిటీలో గంటల కొద్దీ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ స్టడీ జరగాలని, ట్రాఫిక్ నియంత్రణ సమర్థంగా జరిగేందుకు అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సిఎం రేవంత్రెడ్డి సూచించారు. సిటిలో ఉన్న అన్ని జంక్షన్లను కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. గూగుల్ సహకారంతో ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించే ప్రణాళిక వెంటనే అమలు చేయాలని సిఎం పోలీసు విభాగాన్ని ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణకు డ్రోన్ పోలీసింగ్ విధానం అమలు చేయాలని సిఎం ఆదేశించారు. వెంటనే డ్రోన్లను కొనుగోలు చేయాలన్నారు.
సిటీలో డ్రైనేజీ, మ్యాన్ హోల్స్ క్లీనింగ్కు రోబోలను వాడాలి
రద్దీగా ఉండే ప్రాంతాల్లో వీటిని వినియోగించి ట్రాఫిక్ క్రమబద్ధీకరించాలని సిఎం రేవంత్రెడ్డి చెప్పారు. సిటీలో వర్షం పడితే ట్రాఫిక్ గంటల కొద్దీ ఆగిపోతుందని, జంక్షన్లలో నీళ్లు నిల్వకుండా వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ను నిర్మించాలని సిఎం రేవంత్ ఆదేశించారు. కోర్ అర్భన్ సిటీలో మున్సిపల్, పోలీస్, విద్యుత్, జలమండలి విభాగాల యూనిట్లు, వాటిని పర్యవేక్షించే అధికారుల పరిధి ఒకేతీరుగా ఉండాలని సిఎం సూచించారు. (ఉదాహరణకు మున్సిపల్ జోన్ ఏరియా, అక్కడి పోలీస్ స్టేషన్ ఏరియా, జలమండలి, విద్యుత్ సర్కిల్ పరిధికి) ఒకే హద్దులుంటే అక్కడుండే అధికారుల పర్యవేక్షణ, సమన్వయం సమర్థవంతంగా ఉంటుందన్నారు. అందుకు వీలుగా అన్ని విభాగాలు ఏరియాను, అధికారుల హోదాలను పునర్వవస్థీకరించాలని సిఎం ఆదేశించారు. సిటీలో డ్రైనేజీ, మ్యాన్ హోల్స్ క్లీనింగ్కు రోబోలను వాడాలని, యంత్ర పరికరాలతోనే క్లీనింగ్ జరగాలని సిఎం ఆదేశించారు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానం తరహాలో మూసీ పరివాహకంలో ఉన్న అంబర్పేట స్మశాన వాటికను అధునాతనంగా అభివృద్ధి చేయాలని సిఎం ఆదేశించారు. హుస్సేన్ సాగర్ చుట్టూ నెక్లెస్ రోడ్, ఇందిరా పార్క్, సంజీవయ్య పార్కు ఏరియాను అద్భుతంగా తీర్చిదిద్దాలని సిఎం ఆదేశించారు. ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా హుస్సేన్ సాగర్ 2.0ను అన్ని హంగులతో అభివృద్ధి చేయాలన్నారు.
స్కై వాక్, సైకిల్ ట్రాక్, మల్టీ లెవల్ పార్కింగ్ల నిర్మాణం
స్కై వాక్, సైకిల్ ట్రాక్తో పాటు మల్టీ లెవల్ పార్కింగ్ తో పాటు పర్యాటకులను ఆకట్టుకునే నిర్మాణాలు చేపట్టాలని సిఎం రేవంత్ సూచించారు. కోర్ అర్బన్ సిటీలో ఉన్న పార్కులను పిల్లలను ఆకట్టుకునేలా, వారికి ఆహ్లాదంగా ఉండేలా అభివృద్ధి చేయాలని సిఎం పేర్కొన్నారు. ఇప్పుడున్న పార్కులన్నీ సీనియర్ సిటీజన్లకు, వాకర్లకు పనికొచ్చేవిగా మారిపోయాయని సిఎం రేవంత్ అన్నారు. అన్ని పార్కుల్లో చిల్డ్రన్ జోన్ తో పాటు పిల్లల ఆటపాటలకు వీలుగా ఆకట్టుకునే ప్లే జోన్లను అభివృద్ధి చేయాలన్నారు. వీధి వ్యాపారుల కోసం ప్రత్యేక వెండింగ్ జోన్స్ ను ఏర్పాటు చేయాలని సిఎం సూచించారు. మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్, ఫైర్ సేఫ్టీ అంశాలపై అత్యంత పకడ్బందీ వ్యవస్థ ఉండాలని సిఎం పలు సూచనలు చేశారు. వీధి దీపాలకు సోలార్ విద్యుత్ వినియోగం, కొత్తగా పునరుద్ధరిస్తున్న చెరువుల వద్ద పైలట్ ప్రాజెక్టుగా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని సిఎం పేర్కొన్నారు.
కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సిఎం సూచించారు. సిటీలో ఉన్న అన్ని విద్యుత్ సబ్ స్టేషన్ల అప్ గ్రేడేషన్ తో పాటు, ఎక్కడపడితే అక్కడ ఉన్న ట్రాన్స్ ఫార్మర్లను స్ట్రీమ్ లైన్ చేసి రీ-లొకేట్ చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. మంచినీటి, మురుగునీటి వ్యవస్థపై నిర్వహణ వేర్వేరుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సిఎం ఆదేశించారు. అనుమతుల విషయంలో వివిధ విభాగాల మధ్య సమన్వయం ఉండేలా చూసుకోవాలన్నారు. డ్రగ్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు కఠిన చర్యలు అమలు చేయాలని సిఎం ఆదేశించారు. డ్రగ్స్, గంజాయి సేవించి పట్టుబడితే బాధితులగా చూడవద్దని, కనీసం పది రోజుల పాటు రీహాబిలిటేషన్ సెంటర్లో ఉంచాలని, చర్లపల్లి జైలు ప్రాంగణంలోనే ఈ రీహాబిలిటేషన్ సెంటర్ నిర్మించాలని సిఎం ఆదేశించారు. ఈ సెంటర్ నిర్వహణ, పర్యవేక్షణకు ఎక్స్ మిలిటరీ అధికారుల సేవలను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
Also Read: ఉత్తమ్ కుమార్ రెడ్డికి అసలు బ్రెయినే లేదు: జగదీష్రెడ్డి ఎద్దేవా