జాతీయ రహదారుల నిర్మాణంలో జాప్యం జరగొద్దు
పరిహారం పంపిణీలో అలసత్వం ప్రదర్శిస్తే వేటే
అభివృద్ధి కేంద్రంగా ఫ్యూచర్సిటీ, అమరావతి, గ్రీన్ఫీల్డ్ హైవే
అటవీభూములకు పరిహారంగా ప్రత్యామ్నాయంగా కేటాయింపు
సత్వర అనుమతుల కోసం త్వరలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, భూపేందర్ యాదవ్లతో భేటీ
జాతీయ రహదారుల నిర్మాణంపై జరిగిన సమీక్షాసమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించి భూ సేకరణ, పరిహారం పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. భూ సేకరణ విషయంలో మానవీయ కోణంలో వ్యవహారించాలని అదే సమయంలో రహదారుల నిర్మాణంతో కలిగే లాభాలను రైతులకు వివరించి ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్లను సిఎం ఆదేశించారు. ఆర్బిట్రేషన్ కేసులను త్వరగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం, అనుమతుల జారీ, నూతన ప్రతిపాదనలకు ఆమోదం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ), జాతీయ రహదారుల విభాగం (ఎన్హెచ్), జాతీయ రహదారులు, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ (మోర్త్), రహదారులు, భవనాల శాఖ, అటవీ శాఖ అధికారులతో సచివాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. దీంతోపాటు వివిధ జిల్లాల కలెక్టర్లతో సిఎం రేవంత్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ జాతీయ రహదారులకు నెంబర్ల కేటాయింపునకు సూత్రప్రాయ అంగీకారం తెలుపుతున్నా తర్వాత జరిగే ప్రక్రియలో ఆలస్యం ఎందుకు జరుగుతుందని ముఖ్యమంత్రి ఆరా తీశారు. భూ సేకరణను వేగవంతం చేసి పరిహారం తక్షణమే అందేలా చూడాలని సిఎం అధికారులను ఆదేశించారు.
ఆర్ఆర్ఆర్ సౌత్ అలైన్మెంట్కు వెంటనే ఆమోదముద్ర
నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని సిఎం రేవంత్రెడ్డి సూచించారు. రీజినల్ రింగ్రోడ్డు (ఆర్ఆర్ఆర్) నార్త్ నిర్మాణానికి సంబంధించి కేంద్రం లేవనెత్తిన ప్రతి సందేహాన్ని తాము నివృత్తి చేస్తున్నా ఎప్పటికప్పుడు కొత్త సమస్యలను ఎందుకు లేవనెత్తుతున్నారంటూ ఎన్హెచ్ఏఐ అధికారులను సిఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సందేహాలను ఒకేసారి పంపాలని అధికారులకు సిఎం సూచించారు. ఆర్ఆర్ఆర్ నార్త్, సౌత్ను రెండు వేర్వురు ప్రాజెక్టులుగా చూడవద్దని సౌత్ కూడా నార్త్కు ఇచ్చిన నెంబర్ను కొనసాగించాలని, వెంటనే అనుమతులు మంజూరు చేసి ఏకకాలంలో రెండింటి పనులు ప్రారంభమయ్యేందుకు సహకరించాలని ఎన్హెచ్ఏఐ అధికారులకు సిఎం సూచించారు. దానికి ఎన్హెచ్ఏఐ అధికారులు సుముఖత వ్యక్తం చేశారు. ఆర్ఆర్ఆర్ సౌత్ అలైన్మెంట్కు వెంటనే ఆమోదముద్ర వేయాలని సిఎం కోరారు.
రెండు రాష్ట్రాల మధ్య గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మించాలి
భారత్ ఫ్యూచర్ సిటీ- అమరావతి టు -మచిలీపట్నం 12 వరుసల గ్రీన్ఫీల్డ్ హైవేకు వెంటనే అనుమతులు ఇవ్వాలని ఎన్హెచ్ఏఐ అధికారులకు సిఎం రేవంత్ రెడ్డి సూచించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో తాము డ్రైపోర్ట్, లాజిస్టిక్ పార్క్, ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు చేస్తామని సిఎం తెలిపారు. ఈ గ్రీన్ఫీల్డ్ హైవేతో రెండు రాష్ట్రాల రాజధానుల మధ్య అనుసంధానం ఏర్పడుతుందని, హైదరాబాద్ టు -విజయవాడల మధ్య 70 కిలోమీటర్ల దూరం తగ్గడంతో పాటు సరుకు రవాణాతో భారతదేశంలో మరే జాతీయ రహదారిపై లేనంత రద్దీ, ఆదాయం ఈ గ్రీన్ఫీల్డ్ హైవేతో ఉంటుందని సిఎం తెలిపారు.
ఎలివేటెడ్ కారిడార్కు వెంటనే అనుమతులు ఇవ్వాలి
హైదరాబాద్- టు శ్రీశైలం మార్గంలో రావిర్యాల- మన్ననూర్కు సంబంధించి ఎలివేటెడ్ కారిడార్కు వెంటనే అనుమతులు ఇవ్వాలని సిఎం రేవంత్ రెడ్డి కోరారు. శ్రీశైలం దేవస్థానం, శ్రీశైలం రిజర్వాయర్, టైగర్ ఫారెస్ట్ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు రాకపోకలు సాగిస్తారని సిఎం తెలిపారు. ఎలివేటెడ్ కారిడార్కు అవసరమైన అనుమతులు మంజూరు చేసి తక్షణమే పనుల ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని ఎన్హెచ్ఏఐ అధికారులకు సిఎం సూచించారు. హైదరాబాద్- టు మన్నెగూడ రహదారిలో మర్రి చెట్ల తొలగింపునకు సంబంధించి ఎన్జీటీలో ఉన్న కేసు పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సిఎం సూచించారు. హైదరాబాద్ టు -మంచిర్యాల, -నాగపూర్ నూతన రహదారికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సమర్పించిన ప్రతిపాదనలనే అంగీకరించాలని సిఎం కోరారు.
వారంలోపు అడ్వకేట్ జనరల్తో చర్చించాలి
మంచిర్యాల, వరంగల్, ఖమ్మం, విజయవాడ జాతీయ రహదారి (ఎన్హెచ్ఏఐ -163జి), ఆర్మూర్, జగిత్యాల, మంచిర్యాల (ఎన్హెచ్ఏఐ -63), జగిత్యాల, -కరీంనగర్ (ఎన్హెచ్ఏఐ 563), మహబూబ్నగర్, మరికల్, దియోసుగూర్ (ఎన్హెచ్ఏఐ -167) రహదారులకు సంబంధించి భూ సేకరణ పరిహారం పంపిణీలో జాప్యంపై ఆయా జిల్లాల కలెక్టర్లను సిఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పలుచోట్ల కోర్టు కేసులు పెండింగ్లో ఉన్నాయని కలెక్టర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. అన్ని జిల్లాల్లో ఉన్న కేసులపై నివేదిక రూపొందించి వారం లోపు అడ్వకేట్ జనరల్తో చర్చించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును సిఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పరిహారం పంపిణీలో ఆలస్యంపై సిఎం ప్రశ్నించగా కాలా (కాంపీటెంట్ అథారిటీ ఫర్ ల్యాండ్ అక్విజేషన్) నుంచి నిధుల విడుదల్లో జాప్యం ఉందని కలెక్టర్లు సిఎం దృష్టికి తీసుకువచ్చారు.
అవసరమైతే కేంద్రమంత్రులతో భేటీ అవుతా
భూసేకరణ, పరిహారం పంపిణీని అక్టోబర్ నెలాఖరుకు కచ్చితంగా పూర్తి చేయాల్సిందేనని సిఎం కలెక్టర్లను ఆదేశించారు. భూ సేకరణ, పరిహారం నిర్ణయం, పంపిణీ విషయంలో అలసత్వం చూపే కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లపై వేటు వేస్తామని సిఎం హెచ్చిరించారు. జాతీయ రహదారుల నిర్మాణంలో అటవీ, పర్యావరణ శాఖ పెడుతున్న కొర్రీల గురించి సిఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. 2002 నుంచి 2022 వరకు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అటవీ, పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించారని దాంతో ప్రస్తుతం అనుమతులు ఇవ్వడం లేదని ఫారెస్ట్ సౌత్ రీజియన్ ఐజీ త్రినాధ్ కుమార్ తెలపగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. అవసరమైనచోట ప్రత్యామ్నాయ భూమిని అటవీ పెంపకానికి ఇస్తామని సిఎం తెలిపారు. ఈ విషయంలో అవసరమైతే జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్తో తాను స్వయంగా భేటీ అవుతానని సిఎం తెలిపారు. తమ కార్యాలయ నిర్మాణానికి హైదరాబాద్లో రెండు ఎకరాల భూమి కేటాయించాలని ఎన్హెచ్ఏఐ అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేయగా ఆయన వెంటనే దానికి సమ్మతించారు.
Also Read: అల్పపీడన ప్రభావం.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు