అదానీ విల్మార్ ఐపిఓను అబ్జర్వేషన్లో పెట్టిన రెగ్యులేటర్
ముంబయి: సుమారు రూ.4,500 కోట్ల మేర నిధులను సమకూర్చుకోవాలని ఆలోచిస్తున్న అదానీ గ్రూపు అధినేత గౌతం అదానీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. వంట నూనెల తయారీ కంపెనీ అదానీ విల్మార్ లిమిటెడ్ (ఎడబ్లుఎల్)ను ఐపిఓకు తీసుకెళ్లాలని అదానీ నిర్ణయించారు. ఇందుకోసం అవసరమైన ప్రాథమిక పత్రాలను ఎవిఎల్ సెబికి ఈ నెల 3న సమర్పించింది. కానీ ఈ నెల 13న సెబి వెబ్సైట్ అప్డేట్ ప్రకారం అదానీ విల్మార్ లిమిటెడ్ ఐపిఓను ప్రస్తుతం అబ్జర్వేషన్లో ఉంచుతున్నట్లు తెలిపింది. అయితే అందుకు ఎటువంటి కారణం తెలపలేదు. తాజాగా ఈక్విటీ షేర్లను జారీ చేయడం ద్వారా దాదాపు 600 మిలియన్ డాలర్ల పెట్టుబడులు సేకరించాలని ఎడబ్లుఎల్ ఐపిఓను ప్రతిపాదించింది.
పెట్టుబడులను పెంచడంతో పాటు పెంచడంతో పాటుగా ఉత్పత్తి కేంద్రాలను వృద్ధి చేయడానికి, రుణ వాయిదాల చెల్లింపులకు, ఇతర వ్యూహాత్మక లావాదేవీలకు ఎడబ్లుఎల్ ఐపిఓ ద్వారా నిధులను సేకరించాలని అదానీ లక్షం. ఇదిలా ఉండగా అదానీ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ రెగ్యులేటరీ ఫైలింగ్లో ఎటువంటి సెకండరీ ఆఫరింగ్ లేదని తెలిపింది. ఫార్చూన్ బ్రాండ్ కింద గల వంటనూనెను ఈ కంపెనీ విక్రయిస్తోంది. ఎడబ్లుఎల్లో అదానీ గ్రూప్, విల్మార్ గ్రూపు చెరి సగం వాటాలను కలిగి ఉన్నాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో అదానీ గ్రూపునకు చెందిన ఆరు కంపెనీలు లిస్టెడ్ అయ్యాయి.