Sunday, April 28, 2024

కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కీలక బాధ్యతలు

- Advertisement -
- Advertisement -

AICC appoints Komatireddy as Star Campaigner

కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌గా నియామకం

హైదరాబాద్: కాంగ్రెస్ అధిష్టానం ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా ఆయనను నియమించింది. ఈ మేరకు ఎఐసిసి ప్రకటన విడుదల చేసింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆమోదంతో ఈ నిర్ణయం జరిగిందని తెలిపింది. ఇక రేవంత్‌రెడ్డికి పిసిసి చీఫ్‌గా బాధ్యతలు అప్పగించిన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తపర్చిన సంగతి విదితమే. రేవంత్‌పై డైరెక్ట్‌గానే విమర్శలు గుప్పించారు. ఆ సమయంలో తన ఇంటికి ఎవరూ రావొద్దంటూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. తర్వాత కొందరు సీనియర్ నేతలు చర్చలు జరపడంతో సీన్ మారింది. రైతుల సమస్యలపై ఇందిరాపార్క్‌లో జరిగిన రెండ్రోజుల దీక్షలో రేవంత్‌కొమటిరెడ్డికి తోడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా ఒకే వేదికపై కనిపించారు. ఇక రెండు నెలల క్రితం స్వయంగా రేవంత్‌రెడ్డి.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు.

ఇక ఇటీవల పార్లమెంట్ ఆవరణలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. రాహుల్‌గాంధీతో కొద్ది సేపు మాట్లాడారు. రాష్ట్ర విషయాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు రాష్ట్రంలో పార్టీ పరిస్థితులపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం కోమటిరెడ్డి వెంకటరెడ్డిని స్టార్ క్యాంపెయినర్‌గా నియమించింది. దీంతో ఆయన దూకుడుగా పనిచేస్తారని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై దృష్టి పెట్టిన అధిష్టానం ఇప్పటికే ఆయా రాష్ట్రాల నేతలతో సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల రాష్ట్ర కాంగ్రెస్‌కు చెందిన ముఖ్య నేతలతో కూడా రాహుల్ సమావేశం అయ్యారు. దాదాపు మూడు గంటలకు పైగా సమావేశం కొనసాగింది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, వరి సేకరణ అంశాన్ని రాహుల్‌గాంధీకి వివరించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై రాహుల్‌గాంధీ వారికి దిశానిర్దేశన చేశారు. రాష్ట్రంలో టిఆర్‌ఎస్, బిజెపి విధానాలపైన పోరాటాలను ఉద్ధృతం చేయాలన్నారు.

టిఆర్‌ఎస్ పార్టీ నాయకులతో, ఆ పార్టీ విషయంలో మెతక వైఖరి అవలంబించడం తగదన్నారు. పార్టీ నేతల మధ్య ఐక్యత ముఖ్యమని.. అంతా కలిసి పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలో అధికారమే లక్షంగా ముందుకు సాగాలని చెప్పారు. టిఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలతో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు. ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని వెల్లడించారు. అదే క్రమంలో పార్టీ అంతర్గత విభేదాలపై మీడియా ముందు మాట్లాడవద్దని, ఏ సమస్య ఉన్నా.. తనకు లేదా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌తో చెప్పుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో పలువురు సీనియర్ నేతలు రాహుల్‌గాంధీకి తమ సమస్యలు విన్నవించారు. ఇక ఈ నెల చివరి వారంలో రాహుల్ రాష్ట్రంలో పర్యటించనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News