Thursday, May 2, 2024

అభివృద్ధిలో ఆదర్శంగా అమీన్‌పూర్ మున్సిపాలిటీ

- Advertisement -
- Advertisement -
  • తెలంగాణలో ప్రతిపక్షాలకు స్థానం లేదు
  • బిఆర్‌ఎస్‌లో చేరిన టైలర్స్ కాలనీ వాసులు
  • ప్రతి కాలనీ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక
  • మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

అమీన్‌పూర్: అమీన్‌పూర్ మున్సిపాలిటీని అన్ని రంగాలలో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళికతో పనిచేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి ప్రతిపక్ష పార్టీల నాయకులు కార్యకర్తలు బిఆర్‌ఎస్‌లో చేరుతున్నారని తెలిపారు.ఆదివారం అమీన్‌పూర్ మున్సిపల్ పరిధిలోని సేంతన్ గ్రీన్ పార్క్ హోమ్స్, ప్రణీత్ ప్రణవ్ పనోరమా కాలనీలలో స్థానిక మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డితో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులతో సమావేశమై వారి ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

అనంతరం కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన పార్కు, హైమాస్ట్ లైట్లు ప్రారంభించారు. అనంతరం భవాని నగర్, ఐటి డబ్ల్యూ సిగ్నోడ్ కాలనీ, భవానిపురం కాలనీల చౌరస్తాలో ఏర్పాటుచేసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు. తదనంతరం టైలర్స్ కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో కాలనీకి చెందిన యువకులు, మహిళలు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఎమ్మెల్యే జిఎంఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాలలో ఆయన మాట్లాడుతూ.. నూతనంగా ఏర్పడిన అమీన్‌పూర్ మున్సిపాలిటీని వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళ్తున్నామని తెలిపారు.

పది సంవత్సరాల క్రితం అమీన్‌పూర్ అభివృద్ధి నేడు బిఆర్‌ఎస్ చేపడుతున్న అభివృద్ధి పనులను గమనించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీరంగూడ నుంచి కిష్టారెడ్డిపేట వరకు 67 కోట్ల రూపాయలతో రహదారిని విస్తరించడంతోపాటు, కాలనీల మధ్య అంతర్గత రహదారులను నిర్మించి ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొని వచ్చామని తెలిపారు. ప్రతి కాలనీలో సిసి రోడ్లు, అంతర్గత మురుగునీటి కాలువలు, హైమాస్టు లైట్లు, వీధి దీపాలు కల్పించడంతోపాటు పచ్చదనం పెంపొందించేలా వేలాది మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి ప్రణాళికబద్ధంగా నిధులు కేటాయిస్తున్నావని తెలిపారు.

అతి పిన్న వయసులో స్వతంత్ర సంగ్రామంలో పాల్గొని బ్రిటిష్ వారిని గడగడలాడించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదృష్టమని అన్నారు. భవిష్యత్తు తరాలకు మహనీయుల చరిత్రను తెలియజేయాలన్న సమున్నత లక్ష్యంతో నియోజకవర్గ వ్యాప్తంగా వారి విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు .పోరాడి సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి సంక్షేమంలో దేశానికి ఆదర్శంగా నిలువుతున్న మహోన్నత నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు డిపాజిట్లు గల్లంతయ్యే పరిస్థితులు ఏర్పడబోతున్నాయని అన్నారు. ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల కౌన్సిలర్లు చంద్రకళ గోపాల్, కొల్లూరు మల్లేష్, యునూస్, మున్సిపల్ కమిషనర్ జ్యోతి రెడ్డి, కృష్ణ, నాయకులు బాలరాజ్, ఉపేందర్ రెడ్డి, దాసు, తలారి రాములు, చంద్రశేఖర్, సీనియర్ నాయకులు కాలనీ సంఘాల అధ్యక్షులు, కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News