కేంద్ర మంత్రి అమిత్ షా ఇంగ్లీషు భాషపై తనకు గల అక్కసును వెళ్లగక్కారు. దేశంలో భాషా వివాదం చెలరేగుతున్న సమయంలో అమిత్ షా దేశంలో ఇంగ్లీషు మాట్లాడే వారు త్వరలో సిగ్గుపడతారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కొత్త వివాదానికి తెరలేపారు. ఒక పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడిని హోం మంత్రి దేశీయ భాషలే భారతదేశ గుర్తింపునకు కేంద్ర బిందువులని,, విదేశీ భాషలకన్నా దేశీయ భాషలకే ప్రాముఖ్యం ఇవ్వాలని ఉద్ఘాటించారు. మనదేశంలో ఇంగ్లీషు మాట్లాడేవారు త్వరలోనే సిగ్గుపడతారు. సమాజంలో అలాంటి మార్పు ఎందో దూరంలో లేదు. మనదేశ భాషలు మన సంసృ్కతి ప్రతిబింబించే రత్నాలు.
మన భాష మాట్లాడనపుడు మనం నిజంగా భారతీయులం అనిపించుకోలేం అని అమిత్ షా అన్నారు. భారతీయ భాషా వారసత్వాన్ని పునరుద్ధరించేందుకు దేశవ్యాప్తంగా కొత్త ప్రయత్నాలు జరగాలని అమిత్ షా పిలుపు నిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా వలస బానిసత్వానికి ప్రతీకగా ఇంగ్లీషును మున్ముందు తిరస్కరిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. మనదేశం, మనసంసృ్కతి, మన చరిత్ర, మనమతాన్ని అర్థం చేసుకోవడానికి ఏ విదేశీ భాషా సరిపోదని ఆయన అన్నారు. కొత్త విద్యావిధానం కింద త్రిభాషా సూత్రం అమలు ద్వారా కేంద్రప్రభుత్వం హిందీని బలవంతంగా రుద్దుతోందని కొన్ని దక్షిణాది రాష్ట్రాలు, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు ఆరోపిస్తున్న తరుణంలో అమిత్ షా వ్యాఖ్యలు ప్రాధాన్యత
సంతరించుకున్నాయి.