Thursday, May 2, 2024

జూబ్లీహిల్స్‌లో హాష్‌ ఆయిల్‌ విక్రయిస్తున్న యువకుడి అరెస్ట్‌

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః  హాష్ ఆయిల్ విక్రయిస్తున్న యువకుడిని జూబ్లీహిల్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 410 మిల్లీ లీటర్ల హాష్ ఆయిల్, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం… ఎపిలోని గుంటూరు జిల్లా, పెద్దకాకానీకి చెందిన రెడిబత్తుల జగదీష్ రెడ్డి ఎస్‌ఏపి సిపిఐ కోర్సు నేర్చుకుంటున్నాడు.

2017లో చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎం ఇంజనీరింగ్ కాలేజీలో బి టెక్ పూర్తి చేసిన జగదీష్‌రెడ్డి ఎంబిఏ చేసేందుకు యూకేకు వెళ్లాడు. అక్కడ ఉన్నత విద్య పూర్తి చేసుకుని 2019లో ఇండియాకు తిరిగి వచ్చాడు. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ కోర్సు నేర్చుకునేందుకు వచ్చిన నిందితుడు డ్రగ్స్‌కు బానిసగా మారాడు. ఖర్చులు, డ్రగ్స్‌కు ఖర్చు పెరగడంతో ఇబ్బందులు పడుతున్నాడు. దీంతో హాష్ ఆయిల్ విక్రయించాలని ప్లాన్ వేశాడు.

ఎపి, అల్లూరి సీతారామరాజు జిల్లా, నెట్టపుట్టు గ్రామానికి చెందిన అశోక్ వద్ద తక్కువ ధరకు హాష్ ఆయిల్ కొనుగోలు చేసి హైదరాబాద్‌లో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాడు. నెల క్రితం 500 మిల్లీలీటర్ల హాష్ ఆయిల్‌ను రూ.50,000 ఇచ్చి కొనుగోలు చేశాడు. వాటిని 100 చిన్న బాటిళ్లలో 5 మిల్లీలీటర్ల చొప్పున నింపి అవసరం ఉన్న వారికి రూ.1,800లకు విక్రయిస్తున్నాడు. కొనుగోలు చేసిన హాష్ ఆయిల్‌ను 18మందికి విక్రయించాడు. మిగతాది విక్రయించేందుకు మాదాపూర్ మెట్రో స్టేషన్ వద్ద ఉండగా పోలీసులకు సమాచారం అందింది. వెంటనే దాడి చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై చంద్రశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News