హైదరాబాద్: జబ్బులకు, కాలుష్యానికి దూరంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్ పిలుపునిచ్చారు. బుధవారం గచ్చిబౌలిలోని తన నివాసంలో కుమార్తె ప్రియాంక దత్, మనవడు రిషి కార్తికేయతో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఎపిలోని నర్సాపూర్ ఎంపి రఘురాం కృష్ణంరాజు విసిరిన “గ్రీన్ ఛాలెంజ్”ను అశ్వనీదత్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి పరిరక్షణలో మొక్కలు కీలకమని అన్నారు. “గ్రీన్ ఛాలెంజ్” వంటి ఉత్తమమైన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపి సంతోష్ కుమార్ను అభినందిస్తున్నట్లు తెలిపారు.
సుప్రసిద్ధ దర్శకుడు కె.రాఘవేంద్రరావు, ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ, కాకినాడ ఫోర్ట్ చైర్మన్ కెవి రావు, డాక్టర్ జయంతిలకు మొక్కలు నాటాలని “గ్రీన్ ఛాలెంజ్” విసురుతున్నట్లు అశ్వనీదత్ ప్రకటించారు. భూతాపంతో వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయని, 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుకుంటున్నాయని ప్రియాంక దత్ ఆందోళన వ్యక్తం చేశారు. మొక్కలు సంపద పెరగాల్సిన అవసరం ఉందని, “గ్రీన్ ఛాలెంజ్”లో అందరూ భాగస్వామ్యం కావాలని ప్రియాంక ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో “గ్రీన్ ఛాలెంజ్” కో ఫౌండర్ రాఘవ, హెల్పింగ్ హాండ్స్ ప్రతినిధి సుబ్బరాజ్ పాల్గొన్నారు.
Ashwini Dutt Participating in Green India Challenge