హైదరాబాద్ : జాతీయ బాలిక దినోత్సవాన్ని పురస్కరించుకుని బేటిబచావో, బేటి పడావో కార్యక్రమంలో భాగంగా ఈనెల 20 నుండి 26వ తేదీవరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ జి.రవి సంబంధిత అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జిల్లా టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశంలో మహిళాభివృద్ది శిశుసంక్షేమశాఖ, విద్యా, ఆరోగ్య శాఖల సంయుక్త ఆధ్వర్యంలో బేటి బచావో, బేటీపడావో కార్యక్రమంలో జేసి మాట్లాడుతూ బాలికల గురించి ప్రజల్లో పూర్తి చైతన్యం తీసుకువచ్చి వారికి అన్ని రంగాల్లో అవకాశాలను, హక్కులను కల్పించడం జాతీయ బాలికాదినోత్సవం ముఖ్యం ఉద్దేశమన్నారు.
సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న అన్ని రకాల అసమానతలను నిర్మూలించేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఆడపిల్లల పట్ల చిన్నచూపు లేకుండా బాలురతో సమానంగా ప్రొత్సహించేలా తల్లిదండ్రులు తమవంతు సహాయం సహాకారాలను అందించాలన్నారు. ముఖ్యంగా బాల్య వివాహాలు చేయడం ఒక సాంఘిక దురాచారమని దాని రూపుమాపేందుకు ప్రజలు చైతన్యవంతులు కావాలన్నారు. ఈసమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్రావు, ఆర్డిలు వసంతకుమారి, శ్రీను ఝాన్సీలక్ష్మిబాయి, రాజశ్రీ, విద్యాశాఖకారి వెంకటనర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.