భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర మరోసారి వాయిదా పడింది. జూన్ 19న రోదసి యాత్ర ఉంటుందని తొలుత ఇస్రో తెలిపినప్పటికీ, అది 22 కు వాయిదా పడింది. ఇప్పటికే సాంకేతిక కారణాలతో యాక్సియం 4 ప్రయోగం పలుమార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ మిషన్ కోసం ఉపయోగిస్తున్న ఫాల్కన్ 9 రాకెట్లో ద్రవ ఆక్సిజన్ లీక్ అవుతున్నట్టు అధికారులు గుర్తించడంతో ఈనెల 11న జరగాల్సిన ప్రయోగాన్ని వాయిదా వేశారు. ఆ సమస్య పరిష్కారమైనట్టు తెలిపిన ఇస్రో ,
19 వ తేదీన రోదసీ యాత్ర ఉంటుందని వెల్లడించింది. అయితే తాజాగా ఇది మళ్లీ వాయిదా పడినట్టు ఇస్రో తెలిపింది. “ ప్రయోగ తేదీపై ఇస్రో బృందం యాక్సియం స్పేస్తో సుదీర్ఘ చర్చలు జరిపింది. ప్రయోగ సంసిద్ధతపై నాసా, స్పేస్ఎక్స్తో యాక్సియం స్పేస్ సంప్రదింపులు జరిపింది. ఇటీవల చేపట్టిన మరమ్మతులు, వాతావరణ పరిస్థితులు, సిబ్బంది ఆరోగ్య పరిస్థితిని పరిగణన లోకి తీసుకుని జూన్ 22ను తదుపరి ప్రయోగ తేదీగా యాక్సియం స్పేస్ వెల్లడించింది” అని ఇస్రో తెలిపింది.