హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో భోగి సంబురాలు అంబరాన్నంటాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచే ప్రజలు భోగి మంటలను కాల్చారు. కాలనీలు, అపార్ట్మెంట్లు, ఇళ్ల ఎదుట భారీగా భోగి మంటలను వేశారు. భోగి మంటల చుట్టూ స్థానికులు తిరుగుతూ నృత్యాలు చేశారు. సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ప్రజలు పండుగలను జరుపుకున్నారు.
పర్యాటక, పారిశ్రామిక రంగాల ప్రోత్సాహాకానికి కృషి చేస్తా: తమిళిసై
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సంక్రాంతి పండుగను చెన్నైలో జరుపుకున్నారు. తమ కుటుంబ సభ్యులతో కలిసి గవర్నర్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ తమిళనాడు, -తెలంగాణకు మధ్య వారధిలా ఉంటానని ఆమె తెలిపారు. తెలంగాణ ప్రజలు తమిళనాడులోని ప్రాచీన ఆలయాల శిల్ప సౌందర్యాన్ని వీక్షించాలని ఆతృత కనబరుస్తారన్నారు. తమిళనాడు ఆలయాలను సందర్శించి దేవుడిని ప్రార్థించి, ఇక్కడి ప్రాచీన శిల్పసౌందర్యాన్ని ఆస్వాదించడానికి తాను ఆహ్వానిస్తున్నాని గవర్నర్ పేర్కొన్నారు. పర్యాటక, పారిశ్రామిక రంగాల ప్రోత్సాహాకానికి తాను కృషి చేస్తానని తమిళిసై స్పష్టం చేశారు. జల బంధం తదితర అంశాలపై తనకు అనేక రకమైన ఆలోచనలు ఉన్నాయని గవర్నర్ తెలిపారు.
ప్రకృతిని ప్రేమించాలి, పశుపక్ష్యాదులను పూజించాలి: వెంకయ్యనాయుడు
ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. చెన్నైలో కుటుంబసభ్యులతో కలిసి భోగి మంటలు వేశారు. ఈ సందర్భంగా ప్రజలకు వెంకయ్య సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంక్రాంతి రైతులకు శుభాలు చేకూర్చాలని ఆయన ఆకాంక్షించారు. భోగి పండుగ అంటే మంచిని ఆహ్వానించి చెడును వదిలి పెట్టడమని ఆయన పేర్కొన్నారు. ఈ పండుగకు పెద్దలను స్మరించుకుని వారు చూపిన మార్గాన్ని అనుసరించాలన్నారు. అలాగే కనుమ పండగ అంటే ప్రకృతిని ప్రేమించడం, పశుపక్ష్యాదులను పూజించడమన్నారు. ప్రకృతితో కలిసి జీవించడం దినచర్యలో భాగం చేసుకోవాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు.