వీడియో వైరల్ కావడంతో ప్రతిపక్షాల విమర్శలు
పాట్నా/న్యూఢిల్లీ: బీహార్ అధికార పార్టీ జెడి(యు) ఎంఎల్ఎ గోపాల్ మండల్ రైలులో లోదుస్తులతో తిరిగిన వీడియో వైరల్ అయింది. గురువారం సాయంత్రం పాట్నా నుంచి ఢిల్లీ వెళ్తున్న తేజస్ ఎక్స్ప్రెస్ రైలులో మండల్ టాయిలెట్రూంకు లోదుస్తుల్లో పలుమార్లు వెళ్లడంపై ప్రయాణికుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఓ ప్రయాణికుడితో మండల్ ఘర్షణ పడాల్సి వచ్చింది. దాంతో, ఈ సంఘటనపై రైల్వే పోలీసులు జోక్యం చేసుకున్నారు. దీనిపై గోపాల్మండల్ వివరణ ఇచ్చారు. రైలులోకి వెళ్లిన తర్వాత తనకు కడుపులో ఇబ్బంది తలెత్తిందని మండల్ తెలిపారు. త్వరగా టాయిలెట్రూంకి వెళ్లాల్సి రావడంతో కుర్తా, పైజామా తీసేసి లోదుస్లుల్లోనే వెళ్లాల్సి వచ్చిందని ఆయన తెలిపారు.
తాను అలా వెళ్లడం వల్ల మహిళలు ఇబ్బంది పడ్తారంటూ తోటి ప్రయాణికుడు తనతో గొడవ పడ్డారని, అయితే ఆ సమయంలో తన కంపార్ట్మెంట్లో మహిళలు ఎవరూ లేరని ఆయన అన్నారు. తాను వివరణ ఇచ్చిన తర్వాత ప్రయాణికుడు కూడా తన తప్పు తెలుసుకున్నారని మండల్ అన్నారు. కాగా, ఈ సంఘటనపై బీహార్లోని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఇలాంటి సంఘటనలతో అధికార పార్టీ బీహార్ ప్రతిష్ఠను దిగజారుస్తున్నదని ఆర్జెడి, ఎల్జెపి విమర్శించాయి. పూర్తి వివరాలు తనకు తెలియదని, అయితే ఇలాంటి ఘటనల వల్ల బీహార్ ప్రతిష్ఠ మసకబారుతోందని ఎల్జెపి ఎంపి చిరాగ్పాస్వాన్ అన్నారు. ప్రజల మధ్య ఎలా వ్యవహరించాలో ఎంఎల్ఎలకు ట్యూషన్ చెప్పించాలంటూ ముఖ్యమంత్రి నితీశ్కుమార్కు సూచించారు.