Saturday, May 25, 2024

రాజ్యాంగం పీఠికను బిజెపి ప్రభుత్వం ఎన్నటికీ మార్చదు

- Advertisement -
- Advertisement -
రిజర్వేషన్లు కొనసాగుతాయి
జనంలో ‘భయ వాతావరణాన్ని’ కాంగ్రెస్ సృష్టిస్తోంది
రాజ్యాంగం పీఠికను మార్చింది ఆ పార్టీ ప్రభుత్వమే
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

న్యూఢిల్లీ : బిజెపి ప్రభుత్వం రాజ్యాంగం పీఠికను ఎన్నటికీ మార్చదని, రిజర్వేషన్లు రద్దు చేయదని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విస్పష్టంగా ప్రకటించారు. కాంగ్రెస్ జనంలో ‘భయ వాతావరణాన్ని’ సృష్టిస్తున్నదని, ‘వోటు బ్యాంకు’ రాజకీయాల కోసం తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నదని రాజ్‌నాథ్ ఆరోపించారు. రాజ్‌నాథ్ సింగ్ ‘పిటిఐ’కి ఇంటర్వూ ఇస్తూ, బిజెపి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని కాంగ్రెస్ ‘దుష్ప్రచారం’ చేస్తున్నదని విమర్శించారు. అసలు రాజ్యాంగం పీఠికను మార్చే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగం పీఠికను మార్చడం జరగదని మంత్రి హామీ ఇవ్వడం బిజెపి అధికారాన్ని నిలబెట్టుకుంటే భారత్‌ను అభివర్ణించేందుకు ‘సెక్యులర్’ పదాన్ని తొలగిస్తుందన్న విమర్శకుల ఆందోళనలను పరిహరించినట్లు అయింది.

బిజెపి అధికారాన్ని నిలబెట్టుకుంటే రాజ్యాంగాన్ని ‘చించి, పారవేస్తుంది’ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించసాగారు. రాజ్యాంగం పీఠిక నుంచి ‘సెక్యులర్’ పదాన్ని బిజెపి తొలగించవచ్చు అని ఇతర కాంగ్రెస్ నేతలు కొందరు భయాందోళనలు వెలిబుచ్చారు. ‘కాంగ్రెస్ 80 సార్లు రాజ్యాంగ సవరణలు తీసుకువచ్చింది. వారు ఎమర్జన్సీ సమయంలో పీఠికను మార్చారు’ అని మంత్రి ఆరోపించారు. ‘బిజెపి రాజ్యాంగాన్ని ఎన్నటికీ మార్చదు. పీఠికలో మార్పులు ఉంటాయని రాజ్యాంగ నిర్మాతలు ఎన్నడూ ఊహించలేదు. రాజ్యాంగం ప్రధాన ఉద్దేశాన్ని దెబ్బ తీసింది మీరే (కాంగ్రెసే)’ అని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ‘రాజ్యాంగం పీఠికను మార్చే ప్రసక్తే లేదు. వారు దానిని మార్చారు. ఇప్పుడు మాపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు’ అని ఆయన అన్నారు. 1976లో చేసిన 42వ సవరణ భారత్ అభివర్ణనను ‘సర్వసత్తాక ప్రజాస్వామ్య రిపబ్లిక్’ నుంచి ‘సర్వసత్తాక లౌకిక (సెక్యులర్) ప్రజాస్వామ్య రిపబ్లిక్’ అని మార్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News